సాయిబాబా, నాగ్ అశ్విన్, దుల్కర్ సల్మాన్, సంయుక్త
‘‘ఐ యామ్ గేమ్’ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. ఈ సినిమాని నేను కొంత చూశాను. చాలా వినోదం ఉంటుంది. ఇందులోని కాన్సెప్ట్కు ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. ‘మహానటి’ సినిమా నుంచి దుల్కర్గారితో నా ప్రయాణం కొనసాగుతోంది. కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చే నటుడు ఆయన. కథ కోసం ఎంత దూరమైనా వెళ్తారు’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘ఐ యామ్ గేమ్’.
నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటించారు. వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 3న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘నా ప్రొడక్షన్ లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ఐ యామ్ గేమ్’. తెలుగు ప్రేక్షకులు హీరోలను ఆదరించడంలో చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్గార్లు.. ఇలా ఎవరి పేరు చెప్పినా ప్రేక్షకులు కేరింతలు కొడతారు. అది తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం. మీ అందరి మనసులో నాకు కూడా చోటు కల్పించినందుకు ధన్యవాదాలు. ‘ఐ యామ్ గేమ్’ మూవీతో మరోసారి మిమ్మల్ని అలరిస్తానని నమ్ముతున్నాను’’ అని చెప్పారు. సంయుక్త విశ్వనాథన్, నిర్మాతలు సందీప్ గుణ్ణం, సాయిబాబా మాట్లాడారు.


