
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్. డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా రాణిస్తున్న శిరీష్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలను కొని భారీగా నష్టపోయమని, తిరిగి ఇస్తామని చెప్పిన డబ్బులను కూడా ఇవ్వలేదని విమర్శించాడు. అదే సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సినిమాలను కొని నష్టపోతే.. ఆ నిర్మాత సూర్యదేవరనాగవంశి తిరిగి డబ్బులు ఇచ్చాడని చెబుతూ.. మైత్రీ నిర్మాతలకి, నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేశా చేశారు.
(చదవండి: 'ఆర్య'కు రెమ్యునరేషన్.. అందుకే అల్లు అర్జున్ ఆ రేంజ్కు వెళ్లాడు: శిరీష్)
‘మైత్రీ మూవీస్ బ్యానర్ సినిమాల వల్ల మేం నష్టపోయామే తప్ప.. ఒక్క రూపాయి లాభం వచ్చింది లేదు. వాళ్లకు రేట్లు(డబ్బులు) మాత్రమే కావాలి. మొదట్లో వారి సినిమాలన్నీ నైజాంలో మేమే డిస్ట్రీబ్యూషన్ చేశాం. అల వైకుంఠమురములో.. చిత్రాన్ని నైజాం ఏరియాకి రూ.20 కోట్లకు కొంటే.. రూ. 40 కోట్లు(షేర్) వచ్చింది. ఆ తర్వాత పుష్ప సినిమా వస్తే..దాన్ని రూ.42 కోట్లకి ఇస్తామని చెప్పారు. సూపర్ డూపర్ హిట్టయినా సినిమాకే రూ. 40 కోట్లు వస్తే..వీళ్లు నెక్ట్స్ సినిమాకి రూ. 42 కోట్లు అడగడం ఎంత వరకు న్యాయం? ఇలా చేస్తే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎలా బతకగలడు? వాడు సంపాదించుకోవద్దా?
(చదవండి: 'గేమ్ ఛేంజర్'తో మా బతుకు అయిపోయింది.. మమ్మల్ని అతనే కాపాడాడు: నిర్మాత)
ఇదే కాదు మైత్రీ నిర్మించిన సవ్యశాచి చిత్రాన్ని రూ.5.50 కోట్లకు కొంటే.. మూడున్నర కోట్ల నష్టం వచ్చింది. మరిన్ని చిత్రాలు ఇచ్చి ఆ నష్టాన్ని పూడుస్తామని చెప్పారు. ఆ తర్వాత చిత్రలహరి, అమర్ అక్బర్ అంథోని, గ్యాంగ్ లీడర్ చిత్రాలను ఇచ్చారు. కానీ వాటి వల్ల కూడా నష్టాలే వచ్చాయి. నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి రూ. 7 కోట్ల ఎన్ఆర్ఏ అడిగారు. కానీ ఆ సినిమా వల్ల కూడా రూ.1.75 కోట్లు నష్టం వచ్చింది. ఉప్పెన చిత్రాన్ని మొదటి మాకే ఇస్తానని చెప్పి..రిలీజ్ సమయానికి మేమే సొంతంగా రిలీజ్ చేస్తామని అన్నారు. దీంతో దిల్ రాజు వెళ్లి మాట్లాడి డీల్ సెట్ చేశారు. ఆ చిత్రంతో కొంత లాభాలు వచ్చాయి. ఆ తర్వాత పుష్ప చేశారు. ఇక చివరిగా ‘అంటే సుందరానికి ..’ చిత్రాన్ని మేమే నైజాంలో రిలీజ్ చేసి.. మైత్రీ వాళ్లని దూరం పెట్టేశాం. వారి బ్యానర్లో వచ్చిన చిత్రాలను మేము రిలీజ్ చేయడం లేదు’ అని శిరీష్ అన్నారు.