
ఆర్య సినిమా 2004లో భారీ విజయం అందుకుంది. కథ, దర్శకత్వం సుకుమార్. ఈ మూవీ అల్లు అర్జున్తో పాటు నిర్మాతలు దిల్ రాజు-శిరీష్ల బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు కూడా రెండో సినిమానే.. అయితే, రూ. ఆరు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 35 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఆ సినిమాకు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తాజాగా నిర్మాత శిరీష్ చెప్పుకొచ్చారు.
'ఆర్య సినిమాకు మా బడ్జెట్ రూ. 6 కోట్లు మాత్రమే. అయితే, అల్లు అర్జున్కు రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలో చెప్పాలని అల్లు అరవింద్ను అడిగాం. కానీ, సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఎంత అనేది ఆయన చెప్పలేదు. మాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. ఆయన (అల్లు అరవింద్) ఎంత అడుగుతాడోనని మాలో ఒత్తిడి ఉంది. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు ఆయన ఇంటికి వెళ్లాం. అప్పటికీ రెమ్యునరేషన్ గురించి తేల్చలేదు. మరుసటిరోజున ప్రసాద్ ల్యాబ్లో సినిమా వేశాం. అరవింద్ గారు సినిమా చూసి ఇంటికి వెళ్లిపోయారు. అప్పుడు దిల్ రాజు కూడా ఆయన ఇంటికి వెళ్లారు. సార్.. ఇప్పటికైనా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ చెప్పండి అంటూ దిల్ రాజు రిక్వెస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'తో మా బతుకు అయిపోయింది.. మమ్మల్ని అతనే కాపాడాడు: నిర్మాత)
అప్పుడు అరవింద్( Allu Aravind) ఒక్కటే మాట చెప్పారు. 'ఆర్య సినిమా నైజాంలో కోటి రూపాయలు చేస్తే నా కొడుక్కి పది లక్షలు ఇవ్వండి. రెండు కోట్లు చేస్తే ఇరవై లక్షలు, మూడు కోట్లు చేస్తే ముపై లక్షలు, నాలుగు కోట్లు చేస్తే నలభై లక్షలు ఇవ్వండి. అదే నా కొడుకు రెమ్యునరేషన్. అయితే, ఐదు కోట్లు చేస్తే యాభై లక్షలు ఇవ్వవద్దు. నా కొడుకు రెమ్యునరేషన్ రూ.40 లక్షలు మాత్రమే. కానీ, సినిమా వల్ల నష్టపోయి నైజాంలో కోటి చేస్తే పది లక్షలు మాత్రమే ఇవ్వండి. అంతకు మించి ఇవ్వద్దు.' అని అరవింద్ చెప్పారు.
అల్లు అరవింద్ గారు చాలా ఆదర్శంగా నాడు రెమ్యునరేషన్ అడిగారని ఆ ఇంటర్వ్యూలో శిరీష్ చెప్పుకొచ్చారు. అందుకే నేడు అల్లు అర్జున్ అంత స్థాయిలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోల తండ్రులు నిర్మాతలుగా ఉన్నారు. ఒక నిర్మాత బాధలు ఎలా ఉంటాయో వాళ్లకు తెలుసు. కానీ, డబ్బు విషయంలో అలాంటి హీరోల ప్రవర్తన ఎలా ఉందో అందరికీ తెలుసు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.