కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి చిత్రాల తరువాత ధనుష్ నటిస్తోన్న తాజా చిత్రం కర. ఈ మూవీ టైటిల్ను పొంగల్ సందర్భంగా ప్రకటించారు. ఆయన కెరీర్లో ఇది 54వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాలో మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ధనుశ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2016లో ప్రకటించిన ఓ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో నిర్మాణ సంస్థ ఆయనపై లీగల్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగిపోవడం వల్ల రూ.20 కోట్ల పరిహారం కోరుతూ ధనుశ్కు.. తేనాండల్ ఫిల్మ్స్ లీగల్ నోటీసు పంపినట్లు తెలుస్తోంది.
2016లో నాన్ రుద్రన్ అనే సినిమాను దర్శకత్వం వహించడంతో పాటు నటించడానికి ధనుష్ అంగీకరించారని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే ఈ సినిమా ఆగిపోవడంతో.. తమకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారని తేనాండల్ ఫిల్మ్స్ ఆరోపిస్తోంది. చివరికీ ఆ సినిమా నుంచి కూడా ధనుశ్ తప్పుకున్నారని అంటోంది.
ఈ మూవీ కోసం ముందస్తు చెల్లింపులు, ప్రీ-ప్రొడక్షన్ ఖర్చులకు గానూ దాదాపు రూ.20 కోట్ల నష్టాలు వచ్చాయని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టులో భాగమైన టాలీవుడ్ హీరో నాగార్జున, ఎస్జే సూర్య లాంటి స్టార్ నటులకు చెల్లించిన పారితోషికం కూడా ఇందులో భాగమని తెలుస్తోంది. ముఖ్యంగా ధనుష్ పూర్తి స్క్రిప్ట్ సమర్పించడంలో విఫలమవడం.. ఇతర ప్రొఫెషనల్ కమిట్మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే మా సినిమా ఆగిపోయిందని.. దీనివల్ల తమకు తీవ్ర నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అందువల్లే చట్టపరమైన చర్యలకు దిగినట్లు తేనాండల్ ఫిల్మ్స్ ప్రకటించింది.


