ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన కొత్త మూవీ ‘సీతాపయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముగ్గురు సామాజిక కార్యకర్తలను ఆహ్వానించడంతో పాటు సన్మానించారు. ఎంతోమందికి సాయపడుతున్న రియల్ హీరోలు మీరే అంటూ అర్జున్ వారిని గౌరవించారు. డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే, ట్యాంక్బండ్ శివ, దుశ్చర్ల సత్యనారాయణలను వేదికపై పిలిచి సత్కరించారు. ఆపై ఒక్కొక్కరికి రూ.లక్ష కానుకగా ఇచ్చ తన మంచి మనుసు చూపించారు.
డాక్టర్ మందాకిని ఆమ్టే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వైద్యురాలు, సామాజిక కార్యకర్త. ఆమె భర్త డాక్టర్ ప్రకాష్ ఆమ్టేతో కలిసి, గడ్చిరోలిలోని హేమల్కసాలో మాడియా గోండ్ ఆదివాసీల కోసం లోక్ బిరాదరి ప్రకల్పం (Lok Biradari Prakalp) ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తున్నారు. గాయపడిన, నిరాశ్రయమైన వన్యప్రాణుల సంరక్షణ చేపట్టారు. 2008లో ఈ సేవలకు గానూ ఆమెకు రామన్ మెగసెసే అవార్డు లభించగా ఆమె భర్త ప్రకాష్ ఆమ్టే సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో ఆయనకు పద్మశ్రీ అవార్డును అందించింది.
ట్యాంక్ బండ్ శివ అనడం కంటే శవాల శివ అనగానే హైదరాబాద్లో ఇట్టే గుర్తుపడుతారు. తన తొమ్మిదేళ్ల వయసులోనే హుస్సేన్ సాగర్లో పడిపోయిన ఒకరిని కాపాడి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అప్పటి నుచి వందలాది మందిని ప్రాణాలతో రక్షించాడు. నిత్యం హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతూ వేలాది శవాలను బయటకు తీశారు. ఆపై వారికి తోచిన సాయం కూడా చేస్తారు.

సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పర్యావరణ పరిరక్షణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల వారకి సుపరిచయమే.. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 70ఎకరాల్లో అడవినే సృష్టించి ఆశ్చర్యపరిచారు. అందులో దాదాపు 5 కోట్ల మొక్కలు నాటారు. గవర్నర్ ప్రతిభా పురస్కారం కూడా ఆయన అందుకున్నారు.


