
అల్లు అర్జున్(Allu Arjun) కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. ఇక ఆల్ సెట్ గో... అంటూ అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ(Atlee ) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తారు. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది.
కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబైలో జరగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణలో అల్లు అర్జున్, మృణాల్ ఠాగూర్ పాల్గొంటారని, వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారని సమాచారం.
ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ను సైతం షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట అట్లీ. అయితే ఈ తొలి షెడ్యూల్ షూటింగ్లో దీపికా పదుకోన్ పాల్గొనరట. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని అట్లీ సృష్టిస్తున్నారని, ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.