రామాయంపేట(మెదక్): జిల్లావ్యాప్తంగా 519 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం అయిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం మండలంలోని అక్కన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ఇప్పటివరకు 1,32,992 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా టోకెన్ విధానాన్ని ఖచ్చితంగా అమలు పర్చాలని సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున రైతులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు చెప్పారు. అన్ని కేంద్రాల్లో గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజని, ఎంపీడీఓ సజీలుద్దీన్, సిబ్బంది ఉన్నారు.
బ్లాక్ లిస్టులో రైస్ మిల్లులు
మెదక్ కలెక్టరేట్: ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. పాపన్నపేట మండలంలోని సాయిలక్ష్మి ట్రేడర్స్, రామాయంపేటలోని భవాని ఇండస్ట్రీస్ను బ్లాక్ లిస్టులో చేర్చినట్లు చెప్పారు. కస్టం మిల్లింగ్ ఆపరేషన్లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు వెల్లడించిన యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా రైస్ మిల్లులకు ఎటువంటి ధాన్యం కేటాయింపు చేయబడవని వెల్లడించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


