క్రమబద్ధీకరణ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరణ కష్టాలు

Mar 28 2025 6:17 AM | Updated on Mar 28 2025 6:15 AM

ఒక్కప్లాటు కోర్టు కేసులో ఉన్నా..

సర్వే నంబర్‌లోని అన్ని ప్లాట్లు నిషేధిత జాబితాలోకి

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రక్రియ తీరు..

అంతంతమాత్రంగానే స్పందన

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లిస్తే 25 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రచారం చేస్తోంది. కానీ ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఇ బ్బందులు పడుతున్నారు. తమ సమస్య లెవల్‌–1 స్థాయి అధికారుల వద్ద పరిష్కారమవుతుందా.. లెవల్‌–2 అధికారుల పరిధిలోకి వస్తుందా..? లెవల్‌–3 అధికారుల వద్దకు వెళ్లాలా తెలియక తికమకపడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

నిషేధిత జాబితా కష్టాలు..

ఒక లేఅవుట్‌లోని సర్వేనంబర్‌లో సుమారు 200 ప్లాట్లు ఉంటే.. అందులో ఒకటీ.. రెండు ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉంటే.. ఆ సర్వే నంబర్‌లోని అన్ని ప్లాట్లను నిషేధిత (ప్రొహిబీటెడ్‌) జాబితాలో చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలామంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి ఎన్‌ఓసీ తీసుకుని ఎల్‌–1 స్థాయి అధికారులను క లిస్తే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.

కనిపించని ఓపెన్‌ స్పేస్‌లు..

అనధికారిక వెంచర్లు వేసిన అక్రమార్కులు చాలా చోట్ల ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన 10 శాతం స్థలాలను (టెన్‌ పర్సెంట్‌ ల్యాండ్‌)లను కూడా ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నారు. ఆయా కాలనీల్లో బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కు వంటి వాటి నిర్మాణం కోసం ఈ స్థలాలను కేటాయించాలి. నిబంధనల ప్రకారం ఈ 10 శాతం భూమిని సంబంధిత మున్సిపాలిటీ గానీ, గ్రామపంచాయతీ తన అధీనంలోకి తీసుకోవాలి. కానీ సంబంధిత అధికారులు వెంచర్‌ నిర్వాహకులతో చేతులు కలపడంతో ఈ ప్రజావసరాల ల్యాండ్‌ కూడా పరాధీనమైపోయింది. కానీ, ఈ అనధికారిక లేఅవుట్‌లో ప్లాటు కొన్నందుకు లేని ఓపెన్‌ స్పేస్‌కు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దరఖాస్తుదారులకు ఏర్పడింది.

డాక్యుమెంట్స్‌ షార్ట్‌ఫాల్‌ పేరుతో..

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో చాలామందికి డాక్యుమెంట్‌ షార్ట్‌ఫాల్‌ అని వెబ్‌సైట్‌లో చూపుతోంది. అయితే ఏ డాక్యుమెంట్‌ అవసరమో సాధారణ దరఖాస్తుదారులకు తెలియడం లేదు. సేల్‌డీడ్‌, ఈసీ, లింక్‌డాక్యుమెంట్లు, లేఅవుట్‌కాపీ డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. వీటిని నీర్ణీత సైజులో స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే అంతగా అవగాహన లేని వారికి ఈ సాకేంతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

హెల్ప్‌డెస్క్‌ల్లో సమాచారం అంతంతే..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్‌ల్లో పనిచేస్తున్న సిబ్బందికి చాలామందికి ఎల్‌ఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో ఉన్న సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ.. చాలామందిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల నుంచి, మండలాల నుంచి దరఖాస్తుదారులు కలెక్టరేట్‌లకు తరలివస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement