మంచిర్యాలఅగ్రికల్చర్: కొనుగోలు చేసిన ధాన్యం తరలింపునకు సరిపడా లారీలు కేటాయించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, మేనేజర్ శ్రీకళతో కలిసి ధాన్యం తరలింపునకు లారీలు కేటాయించే కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా తాలు, తప్ప, ఎలాంటి మట్టిగడ్డలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్మిల్లలు, గోదాములకు తరలిస్తున్నట్లు తెలిపారు. సరిపడా లారీలు అందుబాటులో ఉంచాలని, లేనిపక్షంలో కాంట్రాక్టర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.
కొనుగోలు కేంద్రం సందర్శన
జైపూర్: వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు తెలిపారు. మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన స్థానిక తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించారు. కేంద్రం నిర్వహకులకు పలు సూచనలు చేశారు. అవసరాన్నిబట్టి హమాలీల సంఖ్య పెంచుకోవాలని తెలిపారు.


