● ఫిర్యాదులపై సత్వర స్పందన..
మెరుగైన సేవలు అందించాలి
● భూత్పూర్ సీఐ కార్యాలయాన్ని
తనిఖీ చేసిన మల్టీజోన్–2 ఐజీ షానవాజ్
భూత్పూర్: నేరాలను ముందుగానే గుర్తించి నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని మల్టీజోన్–2 ఐజీ షానవాజ్ ఖాసిం పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి, మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఐజీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణ, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. తనిఖీలో ఎస్పీ డి.జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ నాగన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


