తెగిన 99 ప్యాకేజీ కాల్వ
పొల్లాలోకి చేరిన నీరు
గద్వాల క్రైం: నీటి ఉధృత్తి కారణంగా కాల్వ పగుళ్లకు గురైన ఘటన గద్వాల మండలంలోని కొండపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెట్టంపాడు ప్రాజెక్టులో భాగమైన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి నీటిపారుదల కలిగిన 99ప్యాకేజీ కాల్వలో 99బీ, 99సీ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే ఇటిక్యాల మండలంలోని రైతులు పంటలకు నీరందక, వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్నాయి. ఈ విషయంపై రైతులు ఇటీవల అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ద్వారా 99కాల్వ ద్వారా 100ప్యాకేజీ వరకు నీటిని విడుదల చేయాలని ఎస్ఈ కేశవరావుకు వివరించారు. దీంతో ఎమ్మెల్యే, ఎస్ఈ కలసి 99 ప్యాకేజీ కాల్వ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో కాల్వలపై బ్రిడ్జి నిర్మాణ పనులు పెండింగ్లో ఉడంతో కాల్వలను దాట్టేందుకు రైతులు చిన్నచిన్న పైపులను ఏర్పాటు చేసుకున్నారు. వాటిద్వారా నీటి ప్రవాహం వేగం ఉండదని, వాటిని తొలగిస్తే ఇటిక్యాల మండలం వరకు నీరు ప్రవహిస్తుందని అధికారులు సూచించారు. కొందరు రైతులు పైపులను తొలగించగా.. మరికొందరు అలాగే ఉంచారు. రైతుల పంటలకు నీరందించేందుకు 99 ప్యాకేజీలో నీటి విడుదల కెపాసిటీని పెంచారు. దీంతో రైతులు అక్కడక్కడా కాల్వలపై వేసిన పైపులు నీటి ప్రవాహానికి అక్విటెక్ వద్ద కొద్దిగా కోతకు గురై తెగిపోయింది. దీంతో కొండపల్లి రైతులు గువ్వల రంగన్న, డోలు రాముడుకు చెందిన మూడెకరాల మిరప, పత్తి పంటలు నీటమునిగాయి. ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలియడంతో 99వ కాల్వలో నీటి ప్రవాహం తగ్గించారు. తెగిపోయిన వద్ద త్వరలో మర్మతులు చేపట్టి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. బాధిత రైతులు జరిగిన నష్టంపై ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
నీటమునిగిన మిరప, పత్తి పంట


