థర్డ్ పార్టీ విచారణ..
● కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
● జిల్లాలో ఇప్పటికే వచ్చిన అర్జీలు 11,487
● ఏడు రకాల పింఛన్ల మంజూరుకు అవకాశం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో పలువురిలో ఆశలు చిగురించాయి. ఈ నెలాఖరులోగా ఏడు రకాల చేయూత పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా జిల్లాలో ఇప్పటికే 11,487 మంది చేసుకున్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, నేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు (తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులు) సరైన పత్రాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల వారు స్థానిక పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లోని బాధితులు వార్డు అధికారుల ద్వారా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేయాలి.
చేయూత పింఛన్ల కోసం జిల్లాలో వచ్చిన దరఖాస్తులపై థర్డ్ పార్టీ విచారణ చేయనున్నట్లు సమాచారం. ఈనెల 31లోగా వచ్చిన దరఖాస్తులను గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. అర్హత, కుటుంబ ఆర్థిక పరిస్థితి, భూమి, వాహనాల ఏ మేరకు కలిగి ఉన్నారు అనే అంశాలను పరిశీలించనున్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉంటే అర్హతను పరిశీలించే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ద్వారా మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది. వృద్ధాప్య పింఛన్లు మాత్రం భర్త మరణిస్తే భార్యకు, భార్య మరణిస్తే భర్తకు పేర్లను ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్లో నమోదు చేస్తున్నారు. బీడీ కార్మికులకు, వృద్ధాప్య పింఛన్లకు అవకాశం కల్పించలేదు.
జిల్లాలో చేయూత పింఛన్ల కోసం అర్హులంతా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నిబంధనల మేరకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేయాలి.
– నర్సింహులు, డీఆర్డీఓ


