వివాహిత అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Mar 21 2025 1:03 AM | Updated on Mar 21 2025 12:57 AM

నారాయణపేట రూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని పేరపళ్ల సమీపంలో ఉన్న డ్రైవర్‌ గోపితండాకు చెందిన శారు రాథోడ్‌ (20)ను సమీపంలోని రెడ్యానాయక్‌తండాకు చెందిన బంధువు వినోద్‌నాయక్‌ ఇచ్చి రెండునెలల క్రితం వివాహం జరిపించారు. పెళ్లి అయిన నాటి నుంచి తనకు ఆ అమ్మాయి వద్దంటూ రాథోడ్‌ తరచూ గొడవపడుతూ ఉండేవాడు. గురువారం ఉదయం ఫోన్‌ రావడంతో వివాహిత తండ్రి లోక్యానాయక్‌ కూతురి ఇంటికి వెళ్లి చూడగా మృతిచెంది కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో హత్య చేశారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరికల్‌ సీఐ రాజేందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

చెన్నంపల్లిలో వ్యక్తి..

లింగాల: మండలంలోని చెన్నంపల్లికి చెందిన ఓర్సు లింగస్వామి (35) గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు గ్రామస్తులు, పోలీసులు తెలిపారు. ఇంటిలో ఒంటరిగా నిద్రించిన వ్యక్తి తెల్లవారేసరికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం.. పాదాలు రక్తంతో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య సైదమ్మ 6 నెలల కిందట ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఉన్న ఇద్దరు కుమారులు ప్రస్తుతం మేనమామ దగ్గర ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన స్థలాన్ని అచ్చంపేట సీఐ రవీందర్‌, ఎస్‌ఐ నాగరాజు, డాగ్‌స్క్వాడ్‌ బృందం క్షుణంగా పరిశీలించాయి. అన్న ఓర్సు బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

చెట్టుపై నుంచికిందపడి..

అడ్డాకుల: మండలంలోని పొన్నకల్‌కు చెందిన సత్యం యాదవ్‌ (30) చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సత్యం ఈ నెల 15న గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఆకు తెంచడానికి పైకెక్కి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్‌నగర్‌కు, అటు నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటాక మృతి చెందినట్లు గ్రామస్తులు వివరించారు. గురువారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. సత్యంకు భార్య భాగ్యమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రోడ్డుప్రమాదంలో

చికిత్స పొందుతూ..

నాగర్‌కర్నూల్‌ క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. బిజినేపల్లి మండలం సల్కర్‌పేటకు చెందిన శ్రీనివాసులు (55) ఈ నెల 17న ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా జిల్లాకేంద్రంలో వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. భార్య శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

జడ్చర్లో యూపీ వాసి..

జడ్చర్ల: స్థానిక హౌసింగ్‌బోర్డుకాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల 16న మైలు విశ్వకర్మ(20), మిత్రుడు నిఖిల్‌ జైస్వల్‌ (19) కలిసి స్కూటీపై మెడికల్‌ షాప్‌కు వెళ్లారు. మందులు కొనుగోలు చేసి తిరిగి విజయనగర్‌కాలనీలోని ఇంటికి వస్తుండగా ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్‌ వైపు నుంచి వచ్చిన నాలుగు చక్రాల ఆటో వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా జిల్లాకేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత నిఖిల్‌ జైస్వల్‌ సొంత ప్రాంతం ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. గురువారం ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

కుక్కల దాడిలో

40 గొర్రె పిల్లల మృతి

అయిజ : వీధి కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతిచెందిన ఘటన మండలంలోని విఠలాపురం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తూముకుంట గ్రామానికి చెందిన కుర్వ దొడ్ల గోపాల్‌ గొర్రె పిల్లలకు రక్షణగా ఇనుప కంచె ఏర్పాటుచేసి గొర్రెల మేపడానికి వెళ్లాడు. రాత్రి గొర్రె పిల్లలకు పాలు తాగిద్దామని కంచె వద్దకు రాగా అందులోని 40 గొర్రె పిల్లలు మృతిచెంది వున్నాయి. దీంతో గోపాల్‌ కన్నీటిపర్వంతమయ్యాడు. వీధి కుక్కలు వలలో దూరి గొర్రె పిల్లలను కొరికేశాయని, రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాఽధిత కాపరి వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement