మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజా వాణి నిర్వహించగా కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విచారణ చేసి వినతులను త్వరగా పరిష్కరించాలని, లేని యెడల కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో 145 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పైళ్లకు భద్రతేది?
ఫైళ్ల విషయంలో భద్రత లేదని, అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుందని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన నోట్ ఫైళ్లు బయటికి ఎలా ఇచ్చారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం కోసం సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు లేకుండా, కనీసం దరఖాస్తు ఇవ్వకుండానే నోట్ఫైళ్లు బయటికి ఎలా వస్తున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులు యాక్షన్ ప్లాన్పై శ్రద్ధపెట్టి జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు.
వచ్చిన వినతుల్లో కొన్ని..
● బయ్యారం మండలం బాలాజీపేట గ్రామస్తులు గ్రామంలో ప్రభుత్వ భవనం కోసం కేటాయించిన స్థలం కబ్జా జరుగుతుందని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు.
● జిల్లా కేంద్రానికి చెందిన శంకర్ తన స్థలం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయిన లాగిన్లో ఉందని, ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని, సమస్యను పరిష్కరించాలని వినతి ఇచ్చాడు.
● సీనియర్ జర్నలిస్టు మట్టూరి నాగేశ్వర్రావు వైద్యా ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్
ప్రజావాణిలో 145 వినతులు


