మహబూబాబాద్ రూరల్ : జిల్లా పోలీసు కార్యాలయం ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబై ప్రారంభానికి సిద్ధమైంది. ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన పోలీసు సేవలే లక్ష్యంగా ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యాలయంలో ఏర్పాట్లు చేసింది. కాగా, రాష్ట్రంలోనే విశాలమైన జిల్లా పోలీసు కార్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందినట్లు సమాచారం.
మహిళా మోర్చా
బలోపేతానికి కృషి
మహబూబాబాద్ అర్బన్: మహిళా మోర్చా సంస్థాగత బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సరోజ అధ్యక్షతన మహిళా మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఆమోదానికి ప్రధాని మోదీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే విపక్ష పార్టీలు అడ్డుకున్నాయని వాపోయారు. మహిళలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం మానుకోట రూరల్ అధ్యక్షుడు జహిందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరగా.. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటీ మహేష్, గడ్డం అశోక్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఓర్సు పద్మ, జిల్లా కార్యాదర్శులు సతీష్, హిందూభారతి, కౌన్సిలర్ శ్రీదేవిబాలు నాయక్, నాయకులు శ్యామ్, చంద్రకళ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
వంకాయ చెట్లకు
సన్నజాజి మాదిరి పూలు
గార్ల: వంకాయ చెట్లకు సన్నజాజి మాదిరి పూసిన పూలను చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరా లు ఇలా ఉన్నాయి. మండలంలోని ముల్క నూరు గ్రామానికి చెందిన కుంట వెంకన్న తన ఇంటి పెరడులో 8 నెలల క్రితం వంకాయ మొ క్కలు నాటాడు. ఇప్పటి వరకు సాధారణంగా పూలతో పాటు కాయలు కాసిన చెట్లు.. మూడు రోజుల నుంచి చెట్ల పైభాగంలో సన్నజాజి పూల మాదిరిగా పూలు పూయడంతో స్థానికులు తరలివచ్చి ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.
జ్ఞాన శక్తిని, కుల సుందరీ అలంకరణలో అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శాకంబరీ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసి అమ్మవారి ఉత్సవమూర్తులను ఇచ్ఛాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి దీప్తా, కులసుందరి (రూపం) క్రమంలో అమ్మవారికి పూజలు చేశారు. షోడశీ క్రమాన్ని అనుసరించి భద్రకాళి మాతను జ్ఞానశక్తి కుల సుందరీదేవీగా అలంకరించగా.. ఆలయ పూజారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అమ్మవారు జ్ఞాన శక్తి కుల సుందరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ఈఓ రాముల సునీత తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు పాల్గొన్నారు.
రేపు జస్టిస్ విజయసేనారెడ్డి రాక
వరంగల్ లీగల్ : హైకోర్టు న్యాయమూర్తి, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేనారెడ్డి ఈనెల 25న (శనివారం) హనుమకొండ జిల్లా కోర్టుకు రానున్నారు. హనుమకొండ జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు జిల్లా కోర్టు, రెండు జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని 10 కోర్టుల భవనంలో ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.


