మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ సూచనలు, కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు షెడ్లలో ఉన్న మక్కల బస్తాలను ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం శుక్రవారం గోదాముల్లోకి తరలింపజేశారు. షెడ్లలో సుమారు 30 వేల బస్తాల మక్కలు ఉండగా హమాలీలు, కూలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి లారీలు, ట్రాక్టర్ల ద్వారా గోదాముల్లో నిలువచేసే ప్రక్రియను మొదలుపెట్టారు. మొదటిరోజు సుమారు మూడు వేల బస్తాల వరకు గోదాముల్లోకి తరలించగా.. రెండు, మూడు రోజుల్లో మిగిలిన బస్తాలను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి సుజన్ బాబు, పీఏసీఎస్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


