● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్ రూరల్ : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మహబూబాబాద్ మండలం అమనగల్, పర్వతగిరి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. అకాల వర్షాలు పడే సూచన ఉన్నందున వ్యవసాయశాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని, గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తాగునీరు, టెంట్, కుర్చీలు, వైద్య సేవలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు.ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ధాన్యం విషయంలో సమస్యలు ఉంటే వెంటనే 79950 50789 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని తెలిపారు. డీఆర్డీఓ మధుసూదన్రాజు, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎస్ఓ రమేష్, సివిల్ సప్లయీస్ డీఎం నరసింహారావు, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, సంబంధిత సిబ్బంది ఉన్నారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి..
గంగారం: వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, మందుల స్టాక్, సిబ్బంది హాజరు, పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్రాజు, సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎస్ఓ రమేష్, డీఎం సివిల్ సప్లయీస్ నర్సింహారావు, తహసీల్దార్ బాలకిషన్, ఎంపీడీఓ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.


