కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీకి భూ ములు ఇచ్చిన అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు, రైల్వే ఉద్యోగుల పిల్లలు, అంప్రెటీస్ చేసిన వారికి కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్, రిటైర్ట్ ప్రొఫెసర్ వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కాజీపేట నుంచి ఢిల్లీ వరకు సకలజనులను ఏకం చేస్తామని వారు స్పష్టం చేశారు. కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ గేట్ ఎదుట ఆదివారం మహా నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా భగవాన్దాస్, కాళిదాస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య, న్యాయవాదులు గుడిమల్ల రవికుమార్, సాయి నరేందర్ మాట్లాడుతూ రైల్వే కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు మాట్లాడుతూ కోచ్ఫ్యాక్టరీ నినాదం అందించిన భగవాన్దాస్, కాళిదాస్ స్ఫూర్తితో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం చేస్తున్న ఉద్యమాలకు అందరూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. రాయబరేలి, లాతూరు, కపుర్తాల మాదిరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరి పి.రవీందర్ మాట్లాడూతూ కేంద్రం ఉద్యోగాల విషయంలో కూడా న్యాయం చేయాలని కోరారు. కార్పొరేటర్లు రాధికరెడ్డి, జక్కుల రవీందర్, విజయశ్రీ రజాలీ మాట్లాడుతూ ప్రధాని మోదీ రామభక్తుడని, మెట్టురామన్న ఆలయ భూమిలో నిర్మిస్తున్న కోచ్ఫ్యాక్టరీలో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల రైల్వే కోచ్ఫ్యాక్టరీ తనిఖీ నిమిత్తం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వచ్చినప్పుడు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు కల 35 ఏళ్ల నాటిదని, ఆంధ్ర పాలకులు రైల్వే జోన్, రైల్వే డివిజన్ తెచ్చుకున్నారని, తెలంగాణ పాలకులు కాజీపేట డివిజన్ ఏర్పాటు విషయంలో విఫలమైతున్నారని ఆరోపించారు. రైల్వే జేఏసీ నాయకులు, 70 మంది అయోధ్యపురం వాసులు దీక్షకు మద్దతు తెలిపారు. నాయకులు తొట్ల రాజు, బండారి సుకేందర్, పసునూరి మనోహర్, మర్యాల కృష్ణ, రైల్వే నాయకులు ఎ.సంతోష్కుమార్, పాక వేదప్రకాశ్, జానీ, రైల్వే సంఘ్ నుంచి యాకూబ్పాషా, మన్నె బాబురావు, మంద కుమార్ మాదిగ, నూనె అప్పారావు, పాపిరెడ్డి, హైదరాబాద్ నుంచి రైల్వే రిటైర్డ్ నాయకులు యుగేంధర్, జీఎస్.బాబురావు, వెంకటయ్య, కాజీపేట రైల్వే రిటైర్డ్ నాయకులు జి.సుధాకర్, పి.కృష్ణమూర్తి, ఎస్ఆర్వీ రావు, కె.సంగమయ్య, టి.సీతారాం తదితరులు పాల్గొన్నారు.
భూనిర్వాసితులు, స్థానికులకు
రైల్వే కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలి
రైల్వే జేఏసీ మహా నిరసన
దీక్షలో వక్తల డిమాండ్


