‘అక్షర’ బాధితులకు న్యాయం చేయండి
జనగామ/వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల డిపాజిట్లను అనధికారికంగా సేకరించి, మోసానికి పాల్పడిన అక్షర చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అక్షర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, అక్షర టౌన్షిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని జనగామ జిల్లాకు చెందిన బాధితులు వజ్రాల అరుణ, కొండారెడ్డి, అరుణ, తులసి, మధుసూదన్ తదితరులు బుధవారం డీజీపీ శివధర్రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. బాధితుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్షర గ్రూప్ సంస్థలు తెలంగాణలో 60కి పైగా బ్రాంచ్లు ఏర్పాటు చేసి చిట్ఫండ్ పేరుతోపాటు భూమిలో అవిభక్త వాటా కొనుగోలు అడ్వాన్స్ పేరుతో కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి మోసం చేశాయి. ఆ సంస్థలు అన్ని విధాలా చట్టవిరుద్ధ కార్యకలాపాలతో తమను మోసం చేశాయని, పరారీలో ఉన్న నిందితుల వెంటనే అరెస్ట్ చేసి వందలాది మంది బాధితులకు న్యాయం చేయాలన్నారు. బ్రాంచ్, రీజనల్ మేనేజర్ల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేయండి
డీజీపీకి జనగామ జిల్లా బాధితుల ఫిర్యాదు


