ప్రపంచ వ్యవస్థ వ్యాపార రంగంతో అనుసంధానం
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి
కేయూ క్యాంపస్ : ప్రపంచ వ్యవస్థ మొత్తం వ్యాపార రంగంతో అనుసంధానమైందని, అంతర్జాతీయ వాణిజ్య విధానాలు దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు.బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాలలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రెండురోజులు నిర్వహించే జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ‘కాంటెంపరరీ ఇష్యూస్ ఇన్ గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రపంచీకరణ వేగంగా విస్తరిస్తున్న 21వ శతాబ్దంలో గ్లోబల్ వ్యాపార నిర్వహణ విధానాలు గణనీయ మార్పులకు లోనవుతున్నాయన్నారు. గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్లో అనేక సమకాలీన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అనంతరం హైదరాబాద్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కామర్స్ విభాగం ప్రొఫెసర్ ఆనంద్ పవార్ మాట్లాడుతూ మార్కెట్ విస్తరణలో కృత్రిమ మేధస్సు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలు సంస్థల విజయానికి దారితీస్తాయని వివరించారు. ఈ సదస్సుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అధ్యక్షతవహించారు. ఈ సదస్సు డైరెక్టర్ ప్రసాద్, కామర్స్ విభాగం డీన్ కె. రాజేందర్, కామర్స్అండ్బిజినెస్మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


