పేరుకే అప్గ్రేడ్ ..
పీహెచ్సీల్లో అందని 24గంటల వైద్యసేవలు
సాక్షి, మహబూబాబాద్: పేదలకు సరైన ప్రభుత్వ వైద్యం అందించాలి.. ప్రసవాలకోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చుచేసుకునే పేదలకు ఊరట కలిగించాలి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచితే తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారని రాష్ట్ర సర్కారు ఆలోచన చేసింది. దీనిలో భాగంగా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈమేరకు మారుమూల ప్రాంతాల్లోని పీహెచ్సీలను అప్గ్రేడ్ చేసి 24గంటలు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని భావించింది. కానీ, జిల్లాలో అది కాగితాలకే పరిమితమైంది. కొన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు లేక.. మరికొన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు డిప్యుటేషన్పై వెళ్లడంతో కనీసం నాలుగు గంటలు కూడా వైద్య సేవలు అందడం లేదని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా సర్దుబాటు..
ఒక వైపు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం చెబుతుంటే.. జిల్లాలో మాత్రం ఉన్న డాక్టర్లను ఇస్టారాజ్యంగా డిప్యుటేషన్లు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో పలు విభా గాలకు ప్రోగ్రాం ఆఫీసర్లు ఉన్నారు. అయితే వారు సక్రమంగా పనిచేయడం లేదనే సాకుతో ఏజెన్సీ, మారుమూల తండాలు ఎక్కువగా ఉన్న పీహెచ్సీల్లోని డాక్టర్లను ప్రోగ్రాం ఆఫీసర్లుగా నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో కొందరు పెద్దసారుకు అనుకూలంగా ఉండి అన్ని పనులు చక్కబెడుతున్నారని, అందుకోసమే అంత ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణ. కోరి తెచ్చుకున్న వారికి ప్రాధాన్యత గల ప్రోగ్రా మ్స్ అప్పగించడం, సీనియర్లను ప్రాధాన్యత లేని విభాగాలు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే కొందరు డాక్టర్లు పీజీ చదివేందుకు వెళ్తున్నారని తెలిసి కూడా ఆయా ప్రాంతాల్లోని డాక్టర్లు, ఎంఎల్హెచ్పీలను డిప్యుటేషన్లు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలే జిల్లాలో పలు పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇక్కడ పనిచేసే వారిని ఇతర జిల్లాలకు డిప్యుటేషన్పై పంపించడంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందో.. తెలియక జరుగుతుందో మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలోని ఆస్పత్రులు, పోస్టులు, వారు పనిచేస్తున్న చోటు, ప్రజ లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉందని, అన్నింటిని సరిచేసి మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
మెరుగైన వైద్యం కోసం..
జిల్లాలో 21ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గూడూరు, గార్లలో సీహెచ్సీలు, మహబూబా బాద్లో జిల్లా ఆస్పత్రి ఉంది. కాగా, తొర్రూరు, బయ్యారం, డోర్నకల్, నెల్లికుదురు, దంతాలపల్లి, మరిపెడ, కంబాలపల్లి, కొత్తగూడ, కోమట్లగూడెం పీహెచ్సీలను 24 గంటల ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేశారు. అయితే ఇందులో సరిపడా డాక్టర్లు పనిచేయడం లేదు. ఇక్కడ కేటాయించిన డాక్టర్లలో కొందరు డిప్యుటేషన్పై వెళ్లారు. మరికొందరు ఉన్నత చదువులకోసం వెళ్లారు. దీంతో సగం మంది డాక్టర్లే పనిచేస్తున్నారు. ఉన్నవారిలో కూడా ఎక్కువ మంది మధ్యాహ్నం వరకు ఉండి వెళ్లిపోతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
మధ్యాహ్నం తర్వాత ఉండని వైద్యులు
రాత్రివేళ రోగులకు తప్పని ఇబ్బందులు
పర్యవేక్షణ కొరవడి ప్రజలకుఅందని ప్రభుత్వ వైద్యం
జిల్లాలో ఇష్టారాజ్యంగా డాక్టర్ల డిప్యుటేషన్లు


