సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
తొర్రూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఆరోగ్య ఉప కేంద్రాలను బుధవారం డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాల అమలు తీరుపై చర్చించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్లో సీ–సెక్షన్ ప్రసవాలను కట్టడి చేయాలని, సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు. జ్వర పీడితులకు తక్షణ వైద్య సాయం అందించాలన్నారు. బీపీ, షుగర్, రక్తహీనతతో బాధపడేవారిని పరీక్షించి మందులు అందజేయాలన్నారు. వైద్యం కోసం వచ్చే పేదలతో మర్యాదగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పించాలన్నారు. వైద్యాధికారి బి. నందనాదేవి, వైద్యులు కె.మానస, శంకర్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


