నేటినుంచి ఇంటర్ పరీక్షలు
● సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు
● 5 నిమిషాలు సడలింపు
● టోల్ ఫ్రీ నంబర్ 1800 5999 333
● హాజరుకానున్న 8,287మంది విద్యార్థులు
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు పరీక్ష కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధిస్తున్నారు. ఎ ండ తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో టెంట్లు, తాత్కాలిక షెడ్స్, చల్లని తాగునీరు, ఏఎన్ఎంలు అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తారు. కాగా, పరీక్షల నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమై నా విద్యార్థులను హాల్లోకి అనుమతి ఇస్తారు.
నిషేధిత పరికరాలు ఇవే..
పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి గడియారాలు, సెల్ఫోన్లు నిషేధించారు. సంబంధిత ఇన్విజిలేటర్లు, అధికారులు కూడా ఫోన్ వాడకూడదు. ఫిబ్రవరి 25నుంచి, మార్చి 16వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ పరీక్షలు కొనసాగుతాయి. మొదటి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు తెలుగు, సంస్కృతం ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 గంటలలోపే విద్యార్థులు పరీక్ష హాల్లో కూర్చోవాలి. పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మదార్గౌడ్ వెల్లడించారు.
హాజరుకానున్న 8,287మంది విద్యార్థులు..
ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 8,287మంది హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 3,156మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 3,113మంది, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1,002 మంది, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,016 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు 18 మంది, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 18మంది, ఇన్విజిలేటర్లు 200మంది పరీక్షల విధులు నిర్వర్తిస్తారు.
పరిశీలనకు ప్రత్యేక అధికారులు..
పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక బృందాలు, అధికారులను ఏర్పాటు చేశారు. పరీక్షల కమిటీ ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్పర్సన్గా, డీఐఈఓ, కళాశాలల సీనియర్ ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉండి పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు కలెక్టర్కు సమాచారం అందిస్తారు. 4 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే సెక్షన్ 50, సెక్షన్ 114 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
వెబ్సైట్లో హాల్టికెట్లు
యాజమాన్యాలు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే విద్యార్థులు https://tgbieht.cgg.gov.in అనే వెబ్సైట్లో పుట్టిన తేదీ, పదో తరగతి హాల్టికెట్ నంబర్ నమోదు చేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోచ్చు. హాల్టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని, చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశించారు. హాల్టికెట్లో ఏవైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాళ్ల ద్వారా డీఐఈఓను సంప్రందించి తక్షణమే సవరించుకోవాలి. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యార్ధులకు పరీక్షల భయం దూరం చేసేందుకు 1800 5999 333 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు.
మొత్తం
విద్యార్థులు 8,287
ఫస్టియర్
విద్యార్థులు 4,158
పరీక్ష కేంద్రాలు 18
అధికారులు 36
ఇన్విజిలేటర్లు 200
4 సిట్టింగ్ స్క్వాడ్స్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
సెకండియర్
విద్యార్థులు
4,129


