తడిసిన మిర్చి.. నేలవాలిన మొక్కజొన్న
కురవి: అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. సోమవారం రాత్రి 11.30గంటలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో కురవి, సీరోలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన రైతుల మిర్చి తడిసిపోగా.. మొక్కజొన్న పంట నేలవాలింది. ప్రభుత్వం దెబ్బతిన్న పంటలను పరిశీలించి పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
డోర్నకల్లో..
డోర్నకల్: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసింది. కాగా మంగళవారం రైతులు కల్లాల్లో చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడవడం వల్ల మిర్చి నల్లబారి ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
నెల్లికుదురులో..
నెల్లికుదురు: మండలంలోని ఆలేరు గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేల వాలింది. మంగళవారం గ్రామ రైతులు మాట్లాడుతూ.. చేతికందొచ్చిన మొక్కజొన్న పంట నేలవాలి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరారు.
తడిసిన మిర్చి.. నేలవాలిన మొక్కజొన్న


