ఆసక్తికరంగా శతావధానం ● కేయూ సెనెట్ హాల్లో నిర్వహణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు విభాగం, కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో కేయూలోని సెనెట్హాల్లో చేపట్టిన అవధాన ప్రియ చేపూరిశ్రీరాం శతావధానం రెండో రోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగింది. కాకతీయ పద్య కవితా వేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో సమర్థవంతంగా 25 సమస్యా పూరణలు, 25 దత్త పదులను, 25 వర్ణణలను రెండు అవృత్తాలను పూర్తి చేశారు. మధ్యలో 25 ఆశువులను కూడా నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన వివిధ అంశాలపై సమస్యలపై పద్యరూపంలో పూరణలు చేసి ఆకట్టుకున్నారు. దుష్కర ప్రాసలను, అసందర్భ సమస్యలను దత్తపదులను అలవోకగా అవధాని చేపూరిశ్రీరాం పూరణ చేశారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మామిడి లింగయ్య, అధ్యాపకుడు డాక్టర్ కర్రె సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.


