మైనార్టీలకు స్వయం ఉపాధి పథకాలు
ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి..
న్యూశాయంపేట: ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ యువత (ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, పార్సీ)కు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కారొరేషన్ ద్వారా వివిధ పథకాలు అందిస్తోంది. మైనారిటీ వర్గాలు తరతరాలుగా చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆధునికీకరణతో వీరి వృత్తులు దెబ్బతిన్నాయి. వారిని తిరిగి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించింది. కేవలం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు తోడ్పాటునందిస్తోంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హుల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా శిక్షణ ఇస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సబ్సిడీతో కూడిన ఈ స్కూటర్లు, వందశాతం సబ్సిడీతో ఉచితంగా పనిముట్ల కిట్లు, జనరేటర్లను పంపిణీ చేయడానికి సంకల్పించింది.
రాళ్లు కొట్టే తురక, కాశ ముస్లిం వర్గాలకు..
రాళ్లు కొట్టే వృత్తిలో (పత్తర్ ఫోడ్) నిమగ్నమైన పేద తురక, కాశ ముస్లిం వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఉపాధి మెరుగుదల కోసం టూల్ కిట్లు, జనరేటర్లు పంపిణీ చేయనుంది. ప్రతి లబ్ధిదారుడికి రూ.60 వేలు వంద శాతం సబ్సిడీతో ఇవ్వనుంది. ఇందులో టూల్కిట్ కోసం రూ.10వేలు, రూ.50 వేల విలువైన జనరేటర్ను అందిస్తారు. దరఖాస్తుదారుడు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల్లోపు వయస్సు ఉండాలి. గత ఐదు సంవత్సరాల్లో టీజీఎంఎఫ్సీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం పొందకుండా ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులో తురక, కాశ ముస్లిం కమ్యూనిటీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, ఆహారభద్రత కార్డు తప్పనిసరిగా పొందుపరచాలి.
నిరుద్యోగ యువతకు
ఈ–స్కూటర్లు
మైనారిటీ నిరుద్యోగ యువత (21 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపు పురుషులు) ఆర్థికంగా బలోపేతం కావడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ పథకంలో భాగంగా ఈ– స్కూటర్లు పంపిణీ చేయనున్నారు. ఈపథకంలో యూనిట్ వ్యయం సుమారు 1.50 లక్షలు కాగా.. అందులో 80 శాతం సబ్సిడీ కింద రూ.1.20 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన 20 శాతం (రూ.30 వేలు) లబ్ధిదారుడు వాటా చెల్లించాలి. ఎంపికై న లబ్ధిదారులను ఊబర్, రాపిడో, ఓలా లాంటి సేవాసంస్థలతో అనుసంధానం చేసి స్వయం ఉపాధికి తోడ్పాటునందిస్తుంది. పథకం కోసం లబ్ధిదారుడు కనీసం పదో తరగతి పాసై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(జీరో కేసులు), పాన్కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, ఆహారభద్రత కార్డు, పాన్కార్డు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా పొందుపరచాలి. ఐదేళ్ల కాలంలో టీజీఎంఎఫ్సీ ద్వారా ఎలాంటి ఆర్థిక సాయం పొందకుండా ఉండాలి.
అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి ఒకటో తేదీ వరకు గడువు ఉంది. టీఎస్ఓబీఎంఎంఎస్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబసైట్లో దరఖాస్తులు సమర్పించాలి. మండల పరిధి ఎంపీడీఓ కార్యాలయం లేదా మున్సిపాలిటీల్లో దరఖాస్తులకు సంబంధించిన రెండు జతల కాపీలు అందజేయాలి. వివరాల కోసం సంబంధిత జిల్లా మైనార్టీ సంక్షేమాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలి.
40 ఏళ్లలోపు నిరుద్యోగులకు
ఈ–స్కూటర్లు
తురక, కాశ వర్గాలకు టూల్కిట్లు, జనరేటర్లు
ఆన్లైన్లో దరఖాస్తులకు గడువు మార్చి ఒకటి వరకు
జిల్లాల వారీగా మంజూరైన
యూనిట్ల వివరాలు..
జిల్లా (ఈ–స్కూటర్స్) (టూల్కిట్లు, జనరేటర్స్)
జనగామ 12 102
మహబూబాబాద్ 17 76
హనుమకొండ 70 62
వరంగల్ 65 58
ములుగు –– ––
జేఎస్ భూపాలపల్లి –– ––


