చరిత్ర నుంచే విలువలను గ్రహించాలి
కేయూ క్యాంపస్: చరిత్ర నుంచే విలువలను గ్రహించాలని కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి సూచించారు. రెండు రోజులుగా కేయూ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో హ్యూమనిటీస్ భవనం సెమినార్హాల్లో నిర్వహిస్తున్న తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ వార్షిక సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సమాజం చరిత్రపై ఆధారపడి ఉందని, మరుగునపడిన చరిత్రను వెలికి తీసి నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మానవ పరిణామ క్రమంలో సంభవించే మార్పులను చరిత్ర ద్వారానే సరిగా అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు పరిశోధనలపై మరింత దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఇ.సుధారాణి మాట్లాడుతూ వాస్తవికమైన చరిత్రను వెలికితీయాలని, చరిత్రను వక్రీకరించకూడదని కోరారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంకం జయప్రకాశ్ మాట్లాడుతూ ఈ సమావేశాల్లో 105 పరిశోధనా పత్రాలు సమర్పించారని తెలిపారు. మూడు స్మారకోపన్యాసాలు, ఐదు సాంకేతిక సమావేశాలు నిర్వహించామని వివరించారు. న్యూఢిల్లీ, పుణె, సిక్కిం, కోల్కతా, పాండిచ్చేరి, కుప్పం, ఏపీ తదితర ప్రాంతాల నుంచి చరిత్రకారులు హాజరై పరిశోధన పత్రాలు సమర్పించారని తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ అధ్యక్షత వహించారు. హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి చిలువేరు రాజ్కుమార్ మాట్లాడారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్దాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకట్రాజం, ఆచార్య కె.విజయ్బాబు, ఆచార్య వరలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గాజుల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ వీసీ
ఆచార్య కె.ప్రతాప్రెడ్డి
ముగిసిన తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం


