పుష్కరాల భూ సర్వే అడ్డగింత
కాళేశ్వరం: వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకుని వీఐపీ ఘాట్ నుంచి సాధారణ ఘాట్ వరకు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనుల కోసం అధికారులు చేపట్టిన భూ సర్వేను స్థానిక రైతులు అడ్డుకున్నారు. మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన భూ సర్వే కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ శాఖ, క్షేత్ర కన్సల్టెన్సీ ఆర్కిటెక్చర్ల బృందం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తుండగా స్థానిక రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. గోదావరి దిగువన కోతకు గురైన పట్టా భూమితో సహా 20 మీటర్ల మేర భూమిని తీసుకుంటామని గతంలో చెప్పి ఇప్పుడు 50 మీటర్ల (160 ఫీట్ల) మేర అత్యవసరమని చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 – 25 మీటర్ల లోపు భూమిని తీసుకుంటేనే ఇస్తామని తేల్చిచెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను రైతులు నగునూరి రమేష్, లక్ష్మీనారాయణ, అరుణ్, కిరణ్, రాజన్న, శ్రీనివాస్ వేడుకున్నారు. రైతుల వినతులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని తహసీల్దార్ రామారావు తెలిపారు. సర్వేలో పీఆర్ డీఈ సాయిలు, ఇరిగేషన్ ఏఈ రవికుమార్, రిటైర్డు ఎండోమెంట్ ఏఈ అశోక్, క్షేత్ర కన్సల్టెన్సీ ఆర్కిటెక్చర్ ఆంజనేయులు, ఆర్ఐ రఘు, సర్వేయర్ రమేష్, జీపీఓ శ్యామ్ పాల్గొన్నారు.
సేవాలాల్ మహరాజ్ కృషి స్ఫూర్తిదాయకం
● రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సురేఖ
కాశిబుగ్గ: పీడిత వర్గాల సమానత్వం కోసం సేవాలాల్ మహరాజ్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాశిబు గ్గలో సేవాలాల్ జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటం వద్ద ఆమె పూజలు చేసి బంజారాలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం డీటీడీఓ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బంజారాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు. వారి కోసం స్థలాలను ఎంపిక చేసి రెండు దేవాలయాలు, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల రంగశాయిపేటలో బంజారాల విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ మంత్రి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. దాంతో ఆమె స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏసీపీని ఆదేశించారు. నగర మేయర్ గుండు సుధారాణి, ఆర్డీఓ సుమ, ఏసీపీ శుభం ప్రకాశ్, ట్రైనీ ఐపీఎస్ మనీషా, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, జయంతి నిర్వహణ కమిటీ చైర్మన్ భూక్య లాల్నాయక్, కార్పొరేటర్లు ఓని స్వర్ణలత, పోశాల పద్మ, వస్కుల బాబు, బాల్నె సురేష్, బస్వరాజు కుమారస్వామి, సునీల్, నాయకులు పాల్గొన్నారు.
పుష్కరాల భూ సర్వే అడ్డగింత


