కట్టెల పొయ్యి కష్టాలు
● వంట గ్యాస్ కనెక్షన్లు లేక తంటాలు
● నామమాత్రంగా కిచెన్ షెడ్లు
● పొగతో నిర్వాహకులు, విద్యార్థుల
ఇబ్బందులు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై వంట చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో వంట గదులు ఉండగా, చాలాచోట్ల వరండాలు, ఆరుబయట వంటలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రకటించాయి. అయితే అమలు కాకపోడంతో కట్టెల పొయ్యిల మీదే వంట చేస్తున్నారు. వంట చేసేవారితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పొగతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో కట్టెలు తడిసి మంట సరిగ్గా రాక తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి తమకు గ్యాస్ కనెన్షన్లు మంజూరు చేస్తే కష్టాలు తప్పుతాయని నిర్వాహకులు కోరుతున్నారు.
44,380 మంది విద్యార్థులు..
జిల్లాలో 100 ఉన్నత, 120 ప్రాథమికోన్నత, 615 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 44,380 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. జిల్లాలో 466 పాఠశాలల్లో కిచెన్షెడ్లు అందుబాటులో ఉన్నాయి. 15చోట్ల మరమ్మతుల్లో ఉన్నాయి. 358 పాఠశాలలకు కిచెన్ షెడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోర్నకల్ మండలంలోని 10పాఠశాలల్లో మాత్రమే గ్యాస్పొయ్యిలపై మధ్యాహ్న భోజనం వండుతున్నారు. కొన్ని పాఠశాలల్లో నిర్వాహకులు సొంతంగా గ్యాస్ సిలిండర్లు తెచ్చుకొని వంటలు చేస్తున్నారు.
చెట్లకిందే వంట.. వానొస్తే కష్టాలు
పలు ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్షెడ్లు లేకపోవడంతో ఆరు బయటే వంటావార్పు చేస్తున్నారు. చెట్లకింద దుమ్ముధూళిలో వంట చేస్తూ మహిళలు పడే ఇబ్బందులు వర్ణణాతీతం. ఇక వానొస్తే వరండాలు, తరగతి గదులే దిక్కుగా మారాయి. బడుల్లో గ్యాస్సిలిండర్లు అందుబాటులో లేక ఆరుబయట కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. దీంతో తరగతి గదుల్లోకి పొగ వెళ్లి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు కిచెన్షెడ్లు మంజూరు చేసింది. కానీ.. అధికారుల అలసత్వంతో చాలా వరకు నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో వంట చేసేందుకు నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి కిచెన్షెడ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే కాకుండా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు కోరుతున్నారు.
కట్టెల పొయ్యి మీద
వండలేకపోతున్నాం..
కిచెన్షెడ్ ఇరుకుగా ఉంది. వర్షానికి కట్టెలు తడుస్తాయని.. ఉన్నదానిలోనే వాటిని పెట్టాల్సి వస్తుంది. కట్టెల ధరలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తే కట్టెల పొయ్యి బాధ తప్పుతుంది. మా మండలంలో చాలా పాఠశాలల్లో కిచెన్షెడ్లు లేక మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు.
–సుజాత, వంట కార్మికురాలు, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, మానుకోట
కట్టెల పొయ్యి కష్టాలు


