రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
● డీఏఓ బి.సరిత
కురవి: రైతులు ఈనెల 28వ తేదీ వరకు సంబంధిత ఏఈఓ, మీసేవ కేంద్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఏఓ బి.సరిత అన్నారు. గురువారం మండలంలోని మోద్గులగూడెం శివారు బేగావత్ తండా గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆమె పర్యవేక్షించారు. అనంతరం మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటల యాజమాన్యంలో ఎక్కువ ఎరువులు వాడుతున్నారని, దానివల్ల నేలసారం దెబ్బతినడమే కాకుండా భవిష్యత్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి దిగుబడి తగ్గుతుందని తెలిపారు. వయ్యారిభామ కలుపు మొక్క వివిధ తెగుళ్లకు కారణమవుతుందని, దానిని తొలగించాలని సూచించారు. దాని ద్వారా రైతులకు ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ గుంటక నరసింహరావు, ఏఈఓ రమ్య, సర్పంచ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో ఉండాలి
మహబూబాబాద్ రూరల్ : వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి సేవలందించాలని డీఏఓ బి.సరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలోని ఏఓలు, ఏఈఓలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతుల వద్దకు చేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతు బీమా, ఫార్మర్ రిజిస్ట్రేషన్, పీఎం కిసాన్, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలపై మండలాల వారీగా సమీక్షించారు. సమీక్షలో ఏడీఏ అజ్మీర శ్రీనివాసరావు, ఏడీఏ టెక్నికల్ మురళీ, టెక్నికల్ ఏఓలు జావేద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


