చిట్టీ పేరుతో మోసం..
● డబ్బు ఇవ్వకుండా బెదిరింపులు
● నిర్వాహకుడిపై కేసు నమోదు
శాయంపేట : చిట్టీ పేరుతో మోసం చేసిన ఘటనలో హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిశోర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రంజిత్ రావు తెలిపారు. కిశోర్ రెడ్డి దాదాపు 15 సంవత్సరాల నుంచి చిట్ ఫండ్తోపాటు చిట్టీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలకడంతో మండంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన కిరణ్ రెడ్డి రూ. 2లక్షలు, మండల కేంద్రానికి చెందిన కొత్త ఇంద్రసేనా రెడ్డి రూ. 37వేలు, ప్రత్యుష రూ. 82 వేల 500, మురహరి స్వరూప రూ. 27వేల 500, అఖిల్, రూ. 55వేల 500, బాసాని పవన్ రూ. 80 వేలు, పత్తిపాకకు చెందిన కండ్రాతి రాజు రూ. 47వేల 500 మొత్తం 5. 29 లక్షలు చెల్లించారు. అయితే సంవత్సరం క్రితం చిట్టీ కాలం పూర్తయింది. దీంతో డబ్బులు ఇవ్వమని కిశోర్ రెడ్డిని అడగగా ఇవ్వడం లేదు. అంతేకాకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఈ ఘటనపై చిట్టీ సభ్యులు కిరణ్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, ప్రత్యుష, రాజు, పవన్, స్వరూప, అఖిల్ ఫిర్యాదు మేరకు కిశోర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రంజిత్ రావు గురువారం తెలిపారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని సీఐ పేర్కొన్నారు.
బైక్ను ఢీకొన్న లారీ..
● వ్యక్తి మృతి..ఒగ్లాపూర్లో ఘటన
దామెర: లారీ.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్లో చోటుచేసుకుంది. శాయంపేట సీఐ రంజిత్ రావు కథనం ప్రకారం.. ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన సిలువేరు మల్లయ్య (50) బైక్పై దమ్మన్నపేట వైపు నుంచి ఒగ్లాపూ ర్ బస్టాండ్ వైపునకు 163 జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ నుంచి గూడెప్పాడ్ వెళ్తు లారీ.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రాధ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ మాడిశెట్టి శ్రీనివాస్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బైక్ అదుపు తప్పిన ఘటనలో
పోచన్నపేటలో యువకుడు..
బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మండలంలోని పోచన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ మండలంలో వెంకిర్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి సారయ్య (37) పెయింటింగ్ పని చేసుకుంటూ యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో భార్యాపిల్లలతో స్థిరపడ్డాడు. రెండు రోజుల క్రితం తన పొలంలో ఎరువు చల్లించడానికి వెంకిర్యాల వచ్చాడు. ఈ క్రమంలో పోచన్నపేట సమీపంలో ఓ యువకుడు మృతి చెందాడనే సమాచారం మేరకు పోలీసులు, కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని సారయ్యగా గుర్తించారు. బైక్ అదుపు తప్పి మృతి చెందాడని ని ర్ధారించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య సంధ్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
ఇంటర్ విద్యార్థులకు
హాల్టికెట్లు
విద్యారణ్యపురి: ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నారు. గురువారం నుంచి సంబంధిత ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, గురుకులాల జూనియర్ కళాశాలలకు లాగిన్ అయి విద్యార్థుల హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో వివిధ కళాశాలలు విద్యార్థుల హాల్టికెట్లను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోగా ఫొటోలు లేకుండా వచ్చాయి. సాంకేతికపర లోపంతో అలా రాగా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనతో కొంత సమయం తర్వాత మరోసారి డౌన్లోడ్ చేయగా సరిగా వచ్చాయి. దీంతో విద్యార్థులకు హాల్టికెట్లు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఫీజుల పేరుతో ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్టికెట్లు ఆపొద్దని డీఐఈఓ గోపాల్ అన్నారు. కాగా, విద్యార్థులు కూడా డౌన్లోడ్ చేసుకునేలా వారి ఫోన్లకు ఒకటిరెండు రోజుల్లో లింక్ పంపనున్నట్లు తెలుస్తోంది.


