విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి
● విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్
జనగామ రూరల్ : రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే ఈ ప్రభుత్వానిది ప్రజాపాలన అవుతుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర నేత, విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో స్కాలర్స్ పాఠశాల గ్రౌండ్లో సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హెకోర్టు న్యాయవాది సాధిక్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థి గర్జన సభలో ఆయన ఆన్లైన్లో మాట్లాడారు. కొఠారి కమిషన్ మొత్తం బడ్జెట్లో విద్య రంగానికి 30 శాతం కేటాయించాలని చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 ఏళ్లుగా పట్టించుకోకుండా ప్రజలను మోసం చేస్తూ వచ్చాయన్నారు. ఇప్పుడు పౌర సమాజం ప్రశ్నిస్తే ఏదో 2 నుంచి 3 శాతం కేటాయిస్తూ తాము విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పడం సబబు కాదన్నారు. విద్యా పరిరక్షణ రాష్ట్ర నాయకుడు నర్సింహా రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగానికి బడ్జెట్లో అతి తక్కువ కేటాయించడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యే సి.హెచ్ రాజారెడ్డి మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను నేటి పాలకులు గుర్తించడంలో విఫలమయ్యారన్నారు. సాధిక్ అలీ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే విద్య, వైద్య రంగాలకు అత్యధిక నిధులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మొండి చేయి చూపడం సరికాదన్నారు. సభలో జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళం పల్లి రాజు, డాక్టర్ రాజమౌళి, జరసం బాధ్యులు జి. కృష్ణ , ఏకశిల ప్రిన్సిపాల్ నళిని, తదితరులు పాల్గొన్నారు.
విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి


