సమర్థవంత ఔషధ అభివృద్ధి జరగాలి
విద్యారణ్యపురి: అంతకణ సంకేత అణువులు ఔషధ లక్ష్యాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని, అందుకే ఔషధ అభివృద్ధి సమర్థవంతంగా జరగాలని అమెరికాలోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ కె. శ్రీనివాస్మూర్తి అన్నారు. గురువారం హనుమకొండలోని కేడీసీలో ‘మాలిక్యూలర్ బేసిస్ ఆఫ్ మెడిసిన్’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శరీరంలోని మెటబాలిజం, అపోస్టోసిస్ వంటి ప్రధాన శారీరక ప్రక్రియలు సెల్ సిగ్నలింగ్ మార్గాల ద్వారా నియంత్రణలోకి వస్తాయన్నారు. ఈ మార్గాల్లో ఏర్పడే లోపాలు క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులకు కారణమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో అంతకణ సంకేత అణువులు ఔషధ లక్ష్యాలుగా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అందుకే సమర్థవంతమైన చికిత్స ఔషధాల అభివృద్ధి జరగాలన్నారు. అంటువ్యాధులు తీవ్ర ఆరోగ్య సవాళ్లుగా మారాయని, వీటి నివారణకు ఔషధ అభివృద్ధి జరగాలని కేయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్, స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి అన్నారు. చైన్నెలోని ఐఐటీ ప్రొఫెసర్ సురేశ్.. క్యాన్సర్ కారకాలు, వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలను తెలిపారు. ఆయుర్వేద వైద్యుడు శ్రీధర్ మాట్లాడుతూ వ్యాధుల నివారణలో ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యం కలిగి ఉందన్నారు. ఈ సదస్సుకు కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సు కన్వీనర్ రోహిణి, జువా లజీ విభాగం సదస్సు కోఆర్డినేటర్లు దినేశ్, గౌరి, స్వామి, రాజయ్య వైస్ప్రిన్సిపాల్ రజనీలత, ఐక్యూఏసీకోఆర్డినేటర్ శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సు మరో రెండు రోజులపాటు కొనసాగనుంది.
యూఎస్ఏ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ శ్రీనివాస్మూర్తి


