అన్నీ మనమే గెలిచాం.. బాగా కష్టపడ్డారు
సాక్షి, మహబూబాబాద్: ‘జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు మనమే గెలిచాం.. పోతది అనుకున్న తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది.. అందరూ బాగా కష్టపడ్డారు.. సీఎం అందరిని అభినందించారు.. ఇలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పనిచేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలి.. తప్పకుండా అందరం కష్టపడుతాం.. విజయం సాధిస్తాం’ ఇలా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య సంభాషణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి తండ్రి మరణించడంతో బుధవారం వేం నరేందర్రెడ్డి పరామర్శకు రెడ్యాల గ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలో మానుకోట శివారు జమాండ్లపల్లి సమీపంలో వరంగల్ నుంచి తమ బంధువుల ఇంటికి వస్తున్న కడియం శ్రీహరి, ఆయన కుమార్తె ఎంపీ కావ్య ఎదురుపడ్డారు. ఒకరిని ఒకరు చూసి వాహనాలు ఆపి కాసేపు మాట్లాడారు. మున్సిపాలిటీల్లో విజయం సాధించినందుకు మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు మురళీనాయక్, రాంచంద్రునాయక్ను వేం నరేందర్ రెడ్డి అభినందించారు. అనంతరం పక్కనే ఉన్న వరంగల్ ఎంపీ కావ్యతో మాట్లాడుతూ.. తొర్రూరు మున్సిపాలిటీ దక్కించుకునేందుకు మీరు బాగా కష్టపడ్డారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నిర్వర్తించారు. మీకు మంచి భవిష్యత్ ఉంటుందని అభినందలు తెలిపారు. అదే విధంగా జిల్లాలోని పరిస్థితులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఇరువురు క్షేమ సమాచారం గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఉన్న డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా, మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ సోమయ్య, కాంగ్రెస్, సీసీఎం వార్డు సభ్యులకు వేం నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.
కడియం కావ్య, మురళీనాయక్, రాంచంద్రునాయక్ను అభినందించిన వేం నరేందర్ రెడ్డి


