ఎమ్మెల్యే.. సభ్యులను కొనాలని చూశారు
● ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి
జనగామ: కాంగ్రెస్ సభ్యులతోపాటు స్వతంత్రంగా గెలిచి తమకు మద్దతు ఇచ్చిన వారిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూశారని ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం జనగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆవరణలో ఎంపీ మాట్లాడారు. డబ్బుతో అన్నీ సాధ్యం కావని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. చేర్యాల పురపాలికలో తమ పార్టీకి చెందిన ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పల్లా కొనుగోలు చేశారని, తాము ఆ దారిలో వెళ్లడం లేదన్నారు. ఇలాంటి డబ్బుల రాజకీయాన్ని పక్కన బెట్టి పట్టణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. 28వ వార్డు సభ్యురాలు హఫీజ్ ఫాతిమాకు సంబంధించి కేసు ఇచ్చారని, అందుకే రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికను వాయిదా వేయాలని చెప్పామే తప్ప, ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూసినా, ధర్మం తమవైపు ఉందన్నారు. అందుకే లాటరీలో గెలిచామన్నారు.
ధర్మం గెలిచింది..
మున్సిపల్ ఎన్నికల్లో లాటరీ ప్రక్రియలో ధర్మం గెలిచిందని, తద్వారా చైర్ పర్సన్ తమవైపు వచ్చిందని కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు భగవంతుడు సైతం సహకరించారన్నారు. ఇక నుంచి జనగామ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి కాబోతుందని, సొంతింటి కలను సాకారం చేసేది కాంగ్రెస్ సర్కారే అన్నారు.
90 మున్సిపాలిటీలను దక్కించుకున్నాం..
రాష్ట్రంలో 116 స్థానాల్లో కాంగ్రెస్ 90 మున్సిపాలిటీలను దక్కించుకుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. జనగామ జిల్లాను క్లీన్ స్వీప్ చేసి సీఎంకుబహుమతి ఇచ్చామన్నారు. డబ్బు ప్రభా వాన్ని పక్కన బెట్టి న్యాయం వైపు దైవం నిలిచిందన్నారు. ఎంపీ చామల, ఇన్చార్జ్ కె.ప్రతాప్ రెడ్డి, ప్రతీ ఒక్కరి సమిష్టి కృషి జనగామ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగుర వేసేలా చేసిందన్నారు.


