తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అప్రజాస్వామికం
దేవరుప్పుల : ప్రజాక్షేత్రంలో ఓటర్లు బీఆర్ఎస్కు మెజార్టీ తీర్పు ఇచ్చినా ప్రభుత్వ యంత్రాంగం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మెప్పు కోసం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అప్రజాస్వామికంగా నిర్వహించిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ దుర్మార్గ ఆలోచనలతో చేజిక్కించుకుందన్నారు. రాష్ట్రంలో ఓటమిని అంగీకరించిన సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో అక్రమంగా ఎంపీ కడియం కావ్యకు ఎక్స్ఆఫీషియా ఓటు హక్కు కల్పించి రహ స్య పద్ధతిలో లక్కీ డ్రా తీశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులో అత్తాకోడళ్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డి అధికార దుర్వినియోగం, గుండాయిజం ప్రదర్శించి అభాసుపాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ కావ్య ఓటు హక్కుపై నిజనిర్ధారణ చేసే ప్రతులను ప్రదర్శించారు. నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, మాజీ జీసీసీ చైర్మన్ ధారావత్ గాంధీ నాయక్, పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి పాల్గొన్నారు.
రాజ్యసభ్య సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర


