‘మల్లన్న’ జాతరకు వేళాయె..
పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ
● నేటి నుంచి మహోత్సవాలు ప్రారంభం..
● ఏర్పాట్లు పూర్తి చేసిన
అధికార యంత్రాంగం
● పోలీసుల భారీ బందోబస్తు
ఐనవోలు: వందల ఏళ్ల చరిత్ర కలిగి ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లిఖార్జున స్వామి జాతరకు వేళ అయ్యింది. జాన పదుల జాతరగా కీర్తిపొందిన మల్లన్న జాతర మహోత్సవాలు నేడు (మంగళవారం) విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13, 14, 15, 16వ తేదీల్లో ప్రధాన జాతర జరగనుంది. ఈ క్రమంలో జాతరకు తరలిరానున్న లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన
జాతర పనులు..
జాతర పనుల్లో భాగంగా క్యూ లైన్లు, చలువ పందిళ్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, జల్లు స్నానాలు, సీ్త్రలు దుస్తులు మార్చుకునే గదుల ఏర్పాటు, వాటర్ ట్యాప్లు, ఈజీఎస్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం, ఆలయం చుట్టూ లైటింగ్, సిరీస్ బల్బుల ఏర్పాటు తదితర పనులన్నీ తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. జాతర సమయంలో రెప్ప పాటు సమయం కూడా కరెంట్కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే, ఆర్డబ్ల్యూఎస్ శాఖ తాగునీరు, నీటి సరఫరాపై దృష్టి సారిచింది. ఐనవోలు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది 24 గంటలు మూడు షిఫ్ట్లుగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ.. ఐనవోలు నుంచి హైదరాబాద్, వరంగల్, కాజీపేట, కొమురవెల్లి, వేములవాడ, యాదగిరి గుట్ట, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించింది. వరంగల్ బస్టాండ్ నుంచి జాతర నాలుగు రోజులు ప్రతీ 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎండోమెంట్ శాఖ నుంచి 30 మంది, రెవెన్యూ శాఖ నుంచి 25 మంది, పంచాయతీ రాజ్ శాఖ నుంచి 150 మంది, జీడబ్ల్యూఎంసీ నుంచి 150 మంది, ఆలయం తరపు నుంచి 70 మంది అధికారులు, సిబ్బంది జారతలో విధులు నిర్వర్తించనున్నారు. జాతర నోడల్ ఆఫీసర్గా ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ను నియమించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 6గురు సీఐలు, 42 మంది ఎస్సైలు, 70 మంది హోంగార్డులు, 250 మంది హెచ్సీలు, కానిస్టేబుళ్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 17 చెక్పోస్టులు, 17 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి 206 సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. అదేవిధంగా జాతర సమయంలో ఏర్పాటు చేసే రంగుల రాట్నం, జాయింట్ వీల్తోపాటు పలు వినోద కార్యక్రమాల పనులు పూర్తయ్యాయి. ఎండోమెంట్ శాఖ నుంచి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా గౌరీశంకర్ నియమితులు కాగా ఆయన ఈఓ కందుల సుధాకర్తో కలిసి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. డీసీపీ అంకిత్ కుమార్ సోమవారం జాతర, క్యూలైన్ల ఏర్పాట్లు పరిశీలించి ఎస్హెచ్ఓ శ్రీనివాస్కు పలు సూచనలు చేశారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత జాతర ఏర్పాట్లను తనిఖీ చేసి ఈఓ సుధాకర్కు పలు సూచనలు చేశారు.
జీడబ్ల్యూఎంసీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి 15 ట్రాక్టర్లు, 4 టాటా ఏస్ వాహనాలు ఏర్పాటు చేసి నిరంతరం చెత్తను తరలించనున్నారు. 10 ట్యాంకర్ల ద్వారా భక్తులకు నీరు సరఫరా చేయనున్నారు. 4 మొబైలు టాయిలెట్లు, ఒక బస్సు టాయిలెట్, 2 ఫాగింగ్ మిషన్లు, ఒక స్వీపింగ్ మిషన్తోపాటు చెత్త పడేయడానికి 150 కుండీలను ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు గాను వంద బీఓటీలతోపాటు 5 చోట్ల మహిళలు దుస్తులు మార్చుకునే గదులు నిర్మించారు. కాగా, జాతరను సక్సెస్ చేయడానికి సుమారు వివిధ శాఖల నుంచి 2 వేల నాలుగు రోజుల పాటు 24 గంటలు పనిచేయనున్నారు.
‘మల్లన్న’ జాతరకు వేళాయె..


