సి.బెళగల్: ప్రభుత్వ గుర్తింపు లేని జీనియస్ గ్లోబల్ స్కూల్ను ఎంఈఓ జ్యోతి సీజ్ చేశారు. సోమవారం ఎంఈఓ తన కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి మండల కేంద్రమైన సి.బెళగల్లోని ప్రైవేట్ పాఠశాలకు చేరుకుని ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల నిర్వహణకు అనుమతులు, గుర్తింపు లేని విషయమై గతంలో యాజమాన్యానికికి మూడు గడువు నోటీస్లు ఇచ్చామన్నారు. గడువులోగా గుర్తింపును పొందలేదని, అదేవిధంగా పాఠశాలను నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల సభ్యులు ఫిర్యాదుల మేరకు విచారించామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండ చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈఓ తెలిపారు. ఆమె వెంట ఎంఐఎస్ రాజారావు, సీఆర్పీ నాగేష్, హెడ్కానిస్టేబుల్ క్రిష్ణ గౌడ్, కానిస్టేబుల్ సత్యరాజు తదితరులు ఉన్నారు.
అంత్యక్రియలకు వెళ్లి
తిరిగి వస్తుండగా..
● ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి
బేతంచెర్ల: హెచ్ కొట్టాల గ్రామ సమీపాన జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నంద్యాల మండలం పుసులూరుకు చెందిన ఎర్రగొండ నాగయ్య, ఆటో డ్రైవర్తో పాటు 8 మంది మండలంలోని ఆర్ కొత్తపల్లె గ్రామంలో ఆదివారం పాముకాటుతో మృతి చెందిన గురు మోహన్ అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ పక్కన్న కూర్చున్న ఎర్రగొండ నాగయ్యపై ఆటో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో బేతంచెర్ల సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. మృతుని సోదరుడు రామ సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు.
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలమహాక్షేతం భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యే క పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఆశీనులను చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు.
బనగానపల్లె రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధికి హైదరాబాద్కు చెందిన ఓ దాత రూ.5 లక్షల విరాళం అందించినట్లు ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం తరఫున దాతకు ఆలయ చైర్మన్, ఈఓ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలో గణేశ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరాది మఠంలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు నగర గౌరవాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ సోమవారం పండుగతో ప్రారంభమై 18వ తేదీ నిమజ్జనం కార్యక్రమంతో పూర్తవుతుందన్నారు. 5 రోజుల చవితి వేడుకులను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఎత్తైన విగ్రహాలు కాకుండా చిన్నవి ప్రతిష్టించి పూజించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కృష్ణమాచార్యులు, సత్యనారాయణ, డమాంశంకర్, చంద్రమోహన్, గాజుల హరిబాబు, పుల్లయ్య, ఈరన్న స్వామి, మురళీధర్రెడ్డి, రామారావు వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్ సుహాసిని, తదితరులు పాల్గొన్నారు.


