వ్యవసాయ అధికారులకు అండగా ఉంటాం
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ అధికారుల అభ్యున్నతికి జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయమని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి అన్నారు. శుక్రవారం కర్నూలులోని ఉద్యాన భవన్లో జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విశ్వనాథ్, దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ 2025–26 సంవత్సరంలో సంఘం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారుల సంఘానికి అన్ని విధాల సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారుల సంఘం తరఫున జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి ఏవోలు, ఏడీఏలకు నూతన సంవత్సరం డైరీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏలు సాలురెడ్డి, మహమ్మద్ ఖాద్రీ, బాలవర్థిరాజు, అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్, వ్యవసాయ ఆధికారుల సంఘం నేతలు రామకృష్ణ, రవిప్రకాశ్, మధుమతి, విష్ణువర్దన్రెడ్డి పాల్గొన్నారు.
నేడు మార్చి నెల పింఛన్ల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెల పింఛన్ల పంపిణీ ఈ నెల 28న చేపట్టడానికి డీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. పంపిణీకి అవసరమైన నిధులు శుక్రవారం బ్యాంకులకు విడుదలయ్యాయి. వెంటనే వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్రా చేసి సచివాలయ ఉద్యోగులకు అందజేశారు. మార్చి 1న ఆదివారం కావడంతో ఈ నెల 28నే పింఛన్లు పంపిణీ చేయను న్నారు. కర్నూలు జిల్లాలో 2,36,185 పింఛన్లకు రూ.103.87కోట్లు, నంద్యాల జిల్లాలో 2,12,494 పింఛన్లకు రూ.92.03 కోట్లు పంపిణీ చేయనున్నారు. మిగిలిపోయిన వారికి మార్చి 2న పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.
ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జాబ్మేళా
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో మార్చి 4న తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చైర్మన్, సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. సంస్థ పరిధిలో ఎలాంటి ఉద్యోగాలు లేవని, అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ/బీటెక్ పాసైన అభ్యర్థులు జాబ్మేళాకు హాజరు కావచ్చన్నారు. ప్రముఖ ప్రయివేటు కంపెనీలు డిక్సన్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, అమర్రాజా గ్రూపు, గ్రీన్టెక్ ఇండస్ట్రీ, అపోలో పార్మసీ తదితర కంపెనీలు జాబ్మేళాకు హాజరవుతాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాత వర్షన్ ప్రకారమే క్రయవిక్రయాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ–నామ్ 2.0 వర్షన్తో పలు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో మళ్లీ ఈ–నామ్ 1.0 వర్షన్ అమలులోకి వచ్చింది. శుక్రవారం జిల్లాలోని కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్ యార్డుల్లో పాత వర్షన్తోనే క్రయవిక్రయాలు చేపట్టారు. అన్ని వైపుల నుంచి కొత్త వర్షన్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో మార్కెటింగ్ శాఖ పాత వర్షన్ వైపే మొగ్గుచూపింది. అయితే ఆధార్, ఓటీపీతో సంబంధం లేకుండా సెల్ఫోన్ నంబర్ ఆధారంగా ఎన్టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టారు. కొద్ది రోజుల పాటు పాత వర్షన్ ప్రకారమే క్రయవిక్రయాలు నడుస్తాయని అధికారులు తెలిపారు.


