మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
కర్నూలు: న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయ భవనంలో మధ్యవర్తిత్వంపై న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యవర్తిత్వ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టుతో పాటు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టారన్నారు. మార్చి 7వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల నుంచి మధ్యవర్తిత్వ ప్రక్రియకు కేసులు స్వీకరిస్తారన్నారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెలిపారు. దీంతో కోర్టులో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


