న్యాయాధికారులకు ఈ–కోర్ట్స్ శిక్షణ
కర్నూలు: న్యాయాధికారులకు ఈ–కోర్ట్స్పై రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. కంప్యూటర్ నైపుణ్యాల అభివృద్ధి, ఈ–కోర్ట్స్ ప్రాజెక్టు అవలోకనం, వీడియో కాన్ఫరెన్సింగ్ తదితర అంశాలపై న్యాయాధికారులకు ఈ–కోర్ట్స్ శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగే ఈ–కోర్ట్స్ శిక్షణ కార్యక్రమానికి విజయవాడ అదనపు జిల్లా జడ్జి మాస్టర్ ట్రైనర్ జి.భూపాల్ రెడ్డి, కర్నూలు ఏఎస్సీజే ఎస్.ప్రతిమ, జూనియర్ సివిల్ జడ్జి బి.పల్లి తదితరులు హాజరయ్యారు. జిల్లా న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు శిక్షణ కార్యక్రమంలో రెండు రోజుల పాటు పాల్గొంటారు.


