కొండంతా అక్రమాలు.. గోరంత రికవరీ
● ఉపాధి హామీ పథకం కింద రూ.14 కోట్లకు పైగా పనులు
● రూ.1,17,500 పక్కదారి
పట్టినట్లు తేల్చిన అధికారులు
ఆలూరు రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024–25 ఏడాదిలో చేపట్టిన పనులు మండలంలోని ఉపాధి సిబ్బంది, మేటీలు కుమ్మకై ్క పనులకు రాని కూలీల పేరు మీద, పండ్ల తోటల పెంపకంలో నాటిన చెట్ల ఎండిపోయినా వాటి నిధులు పక్కదారి పట్టించి చేయని పనులకు బిల్లులు డ్రా చేసినట్లు, కొన్ని గ్రామాల్లో తూతూ మంత్రంగా సోషల్ ఆడిట్ నిర్వహంచినట్లు తెలిపారు. 2024–25లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై పీడీ మాధవీలత శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలో మొత్తం రూ.14,35,43,734 నిధులతో చేపట్టిన 1,488 పనులను గ్రామాల వారీగా సోషల్ ఆడిట్ బృందం సభ్యులు నివేదక సమర్పించారు. చేసిన పనుల కొలతల్లో తేడాలు, రోడ్ల వెంబడి మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం సరిగా లేని కారణంగా రూ.1,17,500 పక్కదారి పట్టినట్లు, రూ.4,140 పెనాల్టీ ఉన్నట్లు ఆడిట్ బృందం సభ్యులు లెక్కలు తేల్చారు. జిల్లా విజిలెన్స్ అధికారిణి షకీలా బేగం, పత్తికొండ డివిజన్ ఏపీడీ లక్ష్మన్న, ఎంపీడీఓ మద్దిలేటి స్వామి, ఎస్ఆర్పీ కాంతయ్య, కోర్స్ డైరెక్టర్లు ఆదినారాయణ, ప్రదీప్ నాయక్, ఏపీఓ శ్రీనివాసులు, డీఆర్పీలు బాలాజీ, మల్లికార్జున, ఉరుకుందప్ప ఉన్నారు.


