
అను‘గృహం’ ఎప్పుడో?
● పేదల గోడు పట్టించుకోని సీఎం చంద్రబాబు ● ఏడాది కాలంలో ఒక్కపేదవాడికీ రాని ఇంటి స్థలం ● ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న జనం ● స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(సెంట్రల్): పేదలకు ఇళ్లస్థలాలు అందడం లేదు. ఇంటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు. నిలువ నీడలేని ప్రజలు సొంతింటి స్థలం, నిర్మాణాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఇదీ హామీ..
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము అధికారంలోకి వస్తే పేదలకు గ్రామీణప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఇంటినిర్మానం కోసం రూ.5 లక్షలు ఇస్తానని వాగ్దానం చేశారు. చంద్రబాబు హామీలపై పేదలు ఎంతో ఆశ పెంచుకున్నారు.
అధికారంలోకి వచ్చి ఏడాదైనా..
అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకరనంతరం పేదలకు గ్రామీణ ప్రాంతల్లో 3, పట్టణప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు మంజూరు చేస్తానని చంద్రబాబు మరో సారి హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి చెప్పిన విధంగా కాకుండా ఐదు లక్షల్లో ఒక లక్ష రూపాయలను తగ్గించి నాలుగు లక్షలు ఇస్తానని సంతకం పెట్టారు. ఏడాదవుతున్నా హామీ అమలు కాలేదు. దీంతో పేదలకు టీడీపీ నేతలు ముఖం చూపడం లేదు.
ఇదీ జరిగింది..
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేదలు దరఖాస్తు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఏడాదిగా పేదలు సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కరికీ ఇంటిస్థలం ఇచ్చింది లేదు. అలాగే ఇంటి నిర్మాణం కోసం రూ. 4 లక్షలు మంజూరు చేయలేదు. జిల్లాలో ఈ ఏడాది 4 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు ఎందుకు వచ్చాయో ఇటీవల తన సమీక్షలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మరోసారి ప్రజల నుంచి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు తీసుకోవాలని, ఇంటింటా సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.
వైఎస్సార్సీపీ హయాంలో..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలో 48 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందులో 39 వేల మందికి పీఎంఏవై అర్బన్–వైఎస్ఆర్ జగనన్న పేరిట ఇళ్లను మంజూరు చేశారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే 22 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 16 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.
‘చంద్ర’ గ్రహణం
అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు వైఎస్సార్ జగనన్న కాలనీలకు ఎన్టీఆర్ కాలనీలు అని పేరు మార్చారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. న్నికల సమయంలో అధికారంలోకి రావడానికి లేనిపోని హామీలు ఇవ్వడం..తరువాత వాటిని పట్టించుకోకపోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని ప్రజలే విమర్శిస్తున్నారు. అందుకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాల హామీని ఉదాహరణగా చూపుతున్నారు. ఏడాది కాలంలో ఒక్క పేదవాడికి సెంటు స్థలం ఇవ్వకుండా, వారి గోడు పట్టించుకోకుండా ఉండడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలపై తీవ్ర విమర్శలుచేసినా బాబు.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం కర్నూలు కలెక్టరేట్ వద్ద మార్చి నెలలో మహిళలు ఆందోళన చేశారు.
పేదలంటే చిన్నచూపు
పేదలంటే అధికారులకు చిన్నచూపు. ఇం టిస్థలం కోసం దరఖాస్తు చేశాం. ఇప్పటి వరకు కనీసం పలకరించలేదు. సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చంద్రబాబు చెప్పిన విధంగా రెండు సెంట్లస్థలం ఇవ్వాలి. లేదంటే ఆయన మాటను మరోసారి నమ్మం. – లవాణ్య, చిత్తరి వీధి, కర్నూలు
అద్దె ఇంట్లో ఉంటున్నాం
మాకు సొంతిల్లు లేదు. ఆదాయం కూడా అంతంత మాత్రమే. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం స్థలం ఇస్తే ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. దాదాపు ఏడాది కింద ఇంటి స్థలం కోసం సచివాలయంలో దరఖాస్తు చేశాం. ఇంతవరకు ఏమీ పట్టించుకోలేదు. కనీసం మమ్మల్ని దరఖాస్తు చేశారని కూడా అడగలేదు. రెండు సెంట్ల ఇంటి స్థలం ఇస్తే సంతోషిస్తాం. – ఎస్.తోహిద్ షేక్ తహమీన్, రోజావీధి, కర్నూలు

అను‘గృహం’ ఎప్పుడో?

అను‘గృహం’ ఎప్పుడో?