
మితిమీరిన విద్యుత్ ప్రమాదాలు
● 2024–24లో 63 మంది మృతి..
19 పశువులు మృత్యువాత
● 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటికే
15 మరణాలు
● పరిహారం అందించడంలో
ప్రభుత్వం మీనమేషాలు
● నాసిరకం మెటీరియల్తోనే
అధిక శాతం ప్రమాదాలు
19.10.2024
కర్నూలులోని బండిమెట్టకు చెందిన శ్రీనివాసవర్మ, లక్ష్మిప్రియ దంపతులకు ఏకై క సంతానం ముత్తు. తల్లిదండ్రులకు ఆధారంగా ఉండేందుకు విద్యుత్ పనులు నేర్చుకున్నాడు. స్థానిక అమీన్ హైదర్నగర్లో విద్యుత్ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డాడు. చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మరణంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. పరిహారం చెల్లించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
14.01.2025
ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామానికి చెందిన కె.వీరేష్ విద్యుత్ వైరింగ్ పనులకు వెళ్లి విద్యుదాఘాతంతో మరణించాడు. భార్య కె.లక్ష్మితో పాటు ముగ్గురు పిల్లలు సంతానం. 10ఏళ్లు, ఎనిమిదేళ్ల మగపిల్లలు కాగా, కుమార్తె వయస్సు 6ఏళ్లు. కుటుంబానికి ఆధారమైన వీరేష్ మరణంతో పిల్లల పోషణ భారం భార్యపై పడింది. వీరేష్ మరణించి ఆరు నెలలు దాటినా పరిహారం ఊసే కరువైంది. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం గమనార్హం.
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలు బలిగొంటుంది. రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా అరికట్టేందుకు కనీస చర్యలు కరువయ్యాయి. మరణించిన వారిని ఆదుకునే విషయంలో అధికారులతో పాటు కూటమి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒకరో, ఇద్దరో కాదు.. ఏడాది కాలంలో 78 మరణాలు చోటు చేసుకోవడం గమనార్హం. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో విద్యుత్ ప్రమాదాల తీవ్రత అధికమైంది. ప్రమాదాల నియంత్రణకు డిస్కమ్లు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం అధికంగా కనిపిస్తోంది. మనుషులతో పాటు పశువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇందుకు స్పష్టమైన కారణాలు తెలుసుకొని తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఏడాదిలో 78 మరణాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నెలలో కనీసం 10–15 వరకు విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది కాలంలో 78 మంది మరణించారంటే ప్రమాదాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. 2023–24 సంవత్సరంలో 51 మంది మనుషులు, 14 పశువులు మరణించాయి. అయితే 2024–25లో 63 మంది మనుషులు, 19 పశువులు మృత్యువాతపడ్డాయి. 2025–26లో ఇప్పటి వరకు 15 మంది మనుషులు, మూడు పశువులు మరణించాయి.
నాసిరకం మెటీరియల్తోనే ప్రమాదాలు
వ్యవసాయ విద్యుత్ను వినియోగించుకునే క్రమంలోనే అధిక శాతం రైతులు మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రమాదాలకు నాసిరకం పరికరాలు వినియోగించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. వ్యవసాయ విద్యుత్కు అవసరమైన పోల్స్, కేబుల్, కండక్టర్, ఇతర మెటీరియల్ విద్యుత్ శాఖనే సరఫరా చేస్తుంది. ఎస్టిమేట్ ప్రకారం రైతులు సబ్సిడీ పోను మిగిలిన మొత్తం చెల్లిస్తే సరఫరాను బట్టి మెటీరియల్ ఇస్తారు. నాణ్యమైన మెటీరియల్ ఇస్తే చాలా వరకు ప్రమాదాలు తగ్గించవచ్చు. అయితే నాసిరకం మెటీరియల్ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో కమీషన్ల బెడద ఎక్కువగా ఉండటం వల్ల చివరికి నాసిరకం మెటీరియల్ రైతులకు చేరుతుందనే ఆరోపణలు ఉన్నాయి.

మితిమీరిన విద్యుత్ ప్రమాదాలు