
ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమైన మూడు నెలల నుంచే ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే నాలుగేళ్లు కలిసికట్టుగా పోరాటం చేసి జగనన్నను మళ్లీ సీఎంగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కర్నూలులోని శ్రీ లక్ష్మీ సమావేశ హాలులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయలేక టీడీపీ నేతలు చేతులెత్తేశారన్నారు. హామీలు అమలు చేయాలని అడిగిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నా ఎవరూ బెదిరేదిలేదన్నారు. అన్నదాతలకు అండగా, విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనలు నిర్వహించామని, యువత పోరు, వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు చేశామని, ప్రజల నుంచి విశేషంగా స్పందన వచ్చిందన్నారు.
● కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్పర్సన్ విజయ మనోహరి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కర్నూలులో గొప్ప గుర్తింపు ఉందంటే ఇక్కడ పనిచేసే నాయకులు, కార్యకర్తలే అన్నారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎస్వీ కుటుంబం అండగా ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు షేక్ యూనుస్ బాషా, షాషా వలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రాష్ట్ర మహిళా విబాగం ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, నగర అధ్యక్షులు మంగమ్మ, భారతి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, పార్టీ శ్రేణులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి