కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జనవరిలో జరిగిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 264 మంది పరీక్షలకు హాజరు కాగా 248 మంది, అనుబంధ పీజీ కళాశాలల కోర్సులకు 147 మంది పరీక్ష రాయగా 134 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి 65 మందికి 39 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు.
ఎల్ఎల్బీ పరీక్షలు ప్రారంభం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఎల్ఎల్బీ 3, 5 సంవత్సరాల కోర్సుల సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్లో జరిగిన మూడు సంవత్సరాల లా ఆరో సెమిస్టర్ పరీక్షలకు 245 మందికి 243 మంది, మధ్యాహ్నం సెషన్లో జరిగిన ఐదు సంవత్సరాల లా 10వ సెమిస్టర్ పరీక్షలకు 31 మందికి 29 మంది హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఓల్డ్సిటీలోని ఉస్మానియా బీఈడీ కళాశాల పరీక్ష కేంద్రంలో జరుగుతున్న పరీక్షల్లో ఇద్దరు చూచిరాతలకు పాల్పడగా గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి
● అంగన్వాడీ కార్యకర్తల ధర్నా
వెల్దుర్తి: తల్లికి వందనం, ఇతరత్రా ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, సరైన సమయంలో జీతాలు, బిల్లులు చెల్లించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె లలిత, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు చాందిని మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేశారన్నారు. పోషణ్ ట్రాకర్ యాప్లోని ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్లను వెంటనే తొలగించాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్కు అందించారు.
కేజీబీవీల్లో బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఆవుట్ సోర్సింగ్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు రిక్వెస్ట్, మ్యుచువల్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చునని డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ ఎస్.శామ్యూల్ పాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సీనియారిటీ జాబితాను తయారు చేసి 24న ప్రదర్శించి, 27వ తేదీలోపు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. తుది సీనియారిటీ జాబితాను 28న ప్రదర్శించి, 30 నుంచి వచ్చే 2వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
తనిఖీల భయంతో
కళాశాల భవనాన్ని మార్చేశారు!
ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణంలో గత రెండు సంవత్సరాలుగా ఒక బిల్డింగ్లో అర్ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నడుపుతున్నారు. అయితే బుధవారం కళాశాల తనిఖీ చేసేందుకు అధికారులు వస్తున్నారని తెలియడంతో భవనాన్ని మర్చారు. అంతేకాకుండా బోర్డు కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. ఒక కళాశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులను సైతం అక్కడికి పంపించారు. తనిఖీ చేయాల్సిన అధికారులు రాక పోవడంతో బోర్డులను పక్కన పెట్టి అక్కడ నుంయి వెళ్లి పోయారు. గత రెండేళ్లుగా కళాశాలను నడుపుతున్నపుడు వేరేచోట చూపించాల్సిన అవసరం ఏమి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది.
పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల