
‘బియ్యం మాయం’పై సబ్ కలెక్టర్ సీరియస్
ఆదోని రూరల్: పట్టణంలోని ఓ ప్రయివేట్ గోదాములో ఈనెల 13న రాత్రి గుర్తించి పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు మాయమవడంపై సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు బుధవారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో ఆయాశాఖల అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టుబడిన బియ్యం మాయం చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఇప్పటికే వన్టౌన్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. గోదాము యజమానికి షోకాజ్ నోటీసు ఇస్తున్నట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు పోలీసు శాఖ దర్యాప్తు ముమ్మరం చేసిందన్నారు. ఆదోని డివిజన్ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బియ్యం ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతోందని, సరిహద్దుల్లో పటిష్ట భద్రత చేపడతామన్నారు. డీలర్లు ప్రజలకు బియ్యం పంపిన విషయంలో అక్రమాలకు పాల్పడితే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.