
ఆలయ కట్ట సాక్షిగా అంటరానితనమా!
కర్నూలు(సెంట్రల్): ఆదోని మండలం డాణాపురం దళిత సర్పంచ్ చంద్రశేఖర్ను ఆలయ కట్టపైకి పిలువకుండా టీడీపీ, బీజేపీ కుల దురహంకారానికి పాల్పడ్డాయని, ఇందుకు బాధ్యులైన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ నాయకురాలు గుడిసె క్రిష్ణమ్మలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం కలెక్టరేట్ ఎదుట కేవీపీఎస్, డీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా డాణాపురం ఘటనను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి మహేష్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప, కేవీపీఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.రమణ, ఎ.గురుస్వామి మాట్లాడుతూ ఈ నెల 16న ఆదోని మండలం డాణాపురంలో జరిగిన కూటమి విజయోత్సవ సభ లో దళితుడైన ఆ గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ను బీజేపీ ఎమ్మెల్యే బి.పార్థసారధి, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ తీవ్రంగా అవమానించారన్నారు. ఆలయ ఆరుగుకట్టపై నిర్వహించిన సభలో దళితుడు కావడంతో పైకి పిలవకపోవడం శోచనీయమన్నారు. ఏకంగా ఎస్సీ సర్పంచ్ పైకి రావడానికి వీల్లేదని గుడిసె కృష్ణమ్మ చెప్పడం, అందుకు ఎమ్మెల్యే సర్పంచ్ను కాళ్ల దగ్గర కింద నిల్చోమనడం హేయమైన చర్య అన్నారు. ఆలయ కట్ట సాక్షిగా అంటరానితనం బయటపడిందన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులు ఏస్థాయిలో అన్యాయానికి గురవుతున్నారో ఈ ఘటన మరోసారి అద్దం పట్టిందన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని, అంబేద్కర్ రాజ్యాంగమంటే కూటమి నేతలు, పోలీసులకు లెక్కలేకుండా పోతోందన్నారు.
ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుబట్టిన సీపీఎం
డాణాపురంలో సర్పంచ్ చంద్రశేఖర్కు జరిగిన అవమానాన్ని సీపీఎం జిల్లా కమిటీ తప్పుపట్టింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ కార్యదర్శి డి.గౌస్దేశాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వేదిక పైనుంచి ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ క్రిస్టియనా అని అడగటం, అందుకు ఎస్సీ అంటూ టీడీపీ నాయకులు చెప్పడం అత్యంత ఘోరమన్నారు. అదేవిధంగా ఘటనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్, అవాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.ఇక్బాల్ హుస్సేన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఎండీ షరీఫ్ వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
● దళిత సర్పంచ్కు అవమానంపై నిరసనల హోరు

ఆలయ కట్ట సాక్షిగా అంటరానితనమా!