
స్వర్ణ తేజం.. ‘గురు’ వైభవం
● శ్రీమఠంలో ఘనంగా బంగారు పల్లకోత్సవం
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రుల స్వామి బృందావన పత్రిమను బంగారు పల్లకీలో కొలువుంచి అశేష భక్తజన వాహిని మధ్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి గురువారం ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు వచ్చారు. వేకువజాము నుంచే రాయరు దర్శనానికి బారులు తీరారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీమఠం వీధులన్నీ కిక్కిరిశాయి. రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. అశేష భక్తజన వాహిని మధ్య రాఘవేంద్రుల బృందావన పత్రిమ బంగారు పల్లకోత్సవం వైభ వంగా జరిగింది. గ్రామ దేవత మంచాలమ్మ దర్శన క్యూలైన్, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో భక్తుల రద్దీ కనిపించింది.
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి చర్యలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సమన్వయకర్త డాక్టర్ ఐ.శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా తరగతుల్లో సీట్ల ఖాళీల వివరాలను తమకు సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల లేదా జిల్లా కేంద్రంలోని డీసీఓ కార్యాలయంలో తెలుసుకోవచ్చన్నారు. ఈ సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామన్నారు. బాలికలకు ఈ నెల 25న దిన్నెదేవరపాడు పాఠశాలలో, బాలురకు చిన్నటేకూరు కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 08518– 295601 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
శ్రీశైలానికి 42,205 క్యూసెక్కుల వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి గత కొద్ది రోజులుగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాజెక్టులైన జూరాల, తుంగభద్రల నుంచి వస్తున్న వరద జలాలతో శ్రీశైలంలో నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం నుంచి గురువారం వరకు ఎగువ ప్రాజెక్ట్ల నుంచి 42,205 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో తాత్కాలికంగా ఉత్పాదనను నిలిపివేశారు. గురువారం సాయంత్రం సమయానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 847.10 అడుగులకు చేరుకోగా, జలాశయంలో 73.9870 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

స్వర్ణ తేజం.. ‘గురు’ వైభవం