
ఉరిమిన వర్షం.. పిడుగులా నష్టం!
అప్రమ్తతంగా ఉండాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నాలుగైదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదివారం రాత్రి ఒక ప్రక టనలో తెలిపారు. ఉరుములతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండ కూ డదని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, గొర్రెలు మేపేవారు సమీపంలోని సురక్షిత భవనాల్లోకి వెళ్లి ప్రాణాపాయం నుంచి సురక్షితంగా ఉండాలన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఉరుములు, మెరుపులు, పి డుగులు, భారీ గాలులతో ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షం రైతులను నిలువునా ముంచింది. తీవ్ర నష్టం మిగిల్చింది. ఉమ్మడి కర్నూ లు జిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయా రు. అకాల వర్షంతో కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిచి పోయింది, పెనుగాలుల తీవ్రతకు అరటి, బొప్పాయి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.
నష్టం ఇలా..
● కౌతాళం మండలం నదిచాగి, మేళిగనూరు గ్రామాల్లోని రైతులు వారం క్రితం వరిని కోసి ధాన్యాన్ని కల్లాల్లో నిల్వ ఉంచారు. అకాల వర్షంతో తడిచి ముద్ద అయ్యింది.
● నందవరం మండలంలో 1,250 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికే 1,100 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవటంతో రైతులకు నష్టం మిగిలింది.
● హొళగుంద మండలంలో గజ్జహళ్లి, వందవాగిలిగ్రామాల్లో వరి పైరు నేలకొరిగింది. గింజలు నేల పాలయ్యాయి. దిగుబడి చేతికొచ్చే సమయంలో ఇలా జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
● కృష్ణగిరి మండలంలోని కొన్ని గ్రామాల్లో పొలాల్లో ఉన్న మిరప పంట, పొగాకు ఉత్పత్తులు వర్షానికి తడిచిపోయాయి.
● హాలహర్వి మండలంలోని బిలేహాల్ గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతు రెండు ఎకరాల్లో బొప్పాయి పంట నేలమట్టం అయ్యింది. దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.
● విరుపాపురం, సుళువాయి తదితర ప్రాంతాల్లో మామిడి చెట్లు, బొప్పాయి చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వచ్చింది.
కాత్రికి గ్రామంలో విషాదం
కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో పిడుగు పడి అశోక్(21), బాలయ్య (22) మృతి చెందారు. అలాగే నిరుపాధి, గంగాధర్ తీవ్రంగా గాయపడ్డారు. క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గాలీవాన మొదలై వర్షం ఎక్కువ కావడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరుకోవడంతో పిడుగు పడి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
● కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో పొలానికి వెల్లిన బోయ శ్రీనివాసులు అనే రైతు పిడుగుపాటు పడి మృతి చెందారు.
కల్లాల్లో తడిచిన వరి ధాన్యం
నేలరాలిన బొప్పాయి, మామిడి
పిడుగుపాటుతో ముగ్గురు మృతి